నీట్ (యూజీ)–2026 పునఃపరీక్షను దేశవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వెల్లడించింది. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు భారతదేశంలోని 5,440 కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలిపి 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని తెలిపింది.
హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 భాషల్లో ప్రశ్నాపత్రాన్ని అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఏ పేర్కొంది. అభ్యర్థుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా 10 వేల మందికి పైగా దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది.
వైద్యపరమైన సమస్యలతో బాధపడుతున్న సుమారు 81 మంది అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ చిన్నారి, కీమోథెరపీ చికిత్స పొందుతున్న మరో విద్యార్థి వంటి అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలుగా చేసిన సన్నాహాలు వృథా కాకుండా పరీక్ష రాసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
పరీక్షలో పారదర్శకత, భద్రతను నిర్ధారించేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, ముఖ గుర్తింపు విధానం అమలు చేసినట్లు తెలిపింది. అన్ని కేంద్రాల్లో నిఘా కెమెరాల పర్యవేక్షణ, సంకేత నిరోధక పరికరాలు, రాష్ట్ర పోలీసుల సహకారంతో రెండు దశల తనిఖీ వ్యవస్థను అమలు చేసినట్లు వెల్లడించింది.
ఇటీవల ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, పునఃపరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది.
