రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంటకు సంబంధించి మొక్కజొన్న కొనుగోళ్లు ఆరంభం అయ్యాయి. రాష్ట్రంలో మొక్కజొన్న అంచనా ఉత్పత్తి 43.18 లక్షల మెట్రిక్ టన్నులు. కాగా ఇందులో 21.59 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరుగుతాయని అంచనా. ప్రభుత్వం జిల్లాల వారీగా మొత్తం 14.89 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మే 20వ తేదీ నాటికి మొత్తం 11.54 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తయింది. కొనుగోలు చేసిన దాంట్లో 9.53 లక్షల మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించారు. ఇంకా 2.01 లక్షల మెట్రిక్ టన్నులు గోదాములకు తరలించాల్సి ఉంది. కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 2.54 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. తర్వాతి స్థానాల్లో నాగర్కర్నూల్ — 1.55 లక్షల మెట్రిక్ టన్నులు, వరంగల్ — 1.11 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్ — 1.05 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
నిల్వల విషయంలో మొత్తం 15.53 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ అవసరం. ప్రస్తుతం 12.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అందుబాటులో ఉంది. ఎక్కడికక్కడే సరిపడే నిల్వ స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవల అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
అదనంగా ఈరోజు గుర్తించిన నిల్వ స్థలం 27 వేల మెట్రిక్ టన్నులు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 2.48 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలాన్ని గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్క జొన్న కొనుగోళ్లకు మొత్తం 3.10 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఇప్పటివరకు 2.42 కోట్ల బ్యాగులు సరఫరా అయ్యాయి. ఇంకా 67.84 లక్షల గన్నీ బ్యాగులు సర్దుబాటు చేయనున్నారు.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్నగర్, నిర్మల్ జిల్లాల్లో హమాలీల కొరత, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రవాణా సమస్యలతో కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నాయి.
