మంత్రి కొండా సురేఖ పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ మేరకు వచ్చే నెల మొదటి వారంలోనే కాంగ్రెస్ అధిష్టానవర్గం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ నుంచి వెలువడుతున్న సమాచారం స్పష్టం చేస్తున్నది. మంత్రి కొండా సురేఖతో బాటు కాంగ్రెస్ పార్టీపై కామెంట్లు చేసిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డిపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తున్నది.
వీరిద్దరిపైనా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. వీరిద్దిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి నిన్ననే తన నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు అందచేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే పార్టీ అధిష్టానం వీరిద్దిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా- ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్కు నివేదికలు చేరాయి. దాంతో అన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ఢిల్లీకి తిరిగి రానున్నారు.
అదే విధంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా శుక్రవారం ఢిల్లీకి రానున్నారు. ఆ తర్వాత సీఎం సహా కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీకి పిలుపు అందుతుందని అంటున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖను ముందు కోరతారు. ఆమె రాజీనామాకు నిరాకరిస్తే పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను కూడా త్వరలో భర్తీ చేయాలని కూడా అధిష్టానవర్గం సీఎం రేవంత్ రెడ్డిని కోరే అవకాశం ఉన్నది. ఆమె పదవికి రాజీనామా చేయకపోతే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో సురేఖను తప్పించే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం, ఇతర ముఖ్యుల భేటీ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నది.
