పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న రైడర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి ఎం. హనుమంతరావు తెలిపారు. సోమవారం డిఎస్పి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడారు.
గత రెండు రోజుల్లో నరసరావుపేట చుట్టుపక్కల కొండలు పిల్లలు బైక్ రైడింగ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో చూసామన్నారు. ముఖ్యంగా నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వెళ్లే మార్గం, వినుకొండ వెళ్లే మార్గాలలో ఈ బైక్ రైడింగ్ చేసినట్లు తెలుస్తుందన్నారు. ఈ రైడర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఇటీవల ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యువకులు ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేయడం పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టామని అన్నారు. బైక్ స్టంట్స్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండన్నారు. ఈ సందర్బంగా పోలీసుల ప్రత్యేక బృందం, సీసీటీవీ కెమెరాలు, పహారా బృందాల సహాయంతో స్టంట్స్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని పోలీసులు సూచించారు. తమ పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారన్న విషయంపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
బైక్ నడిపే వాడికి కచ్చితంగా హెల్మెట్ ఇచ్చి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్క వాహనదారుడు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకునే అవకాశముందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
