రైల్వే భద్రతా పెంపు చర్యల పట్ల దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశలో భాగంగా , గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జోన్ నెట్వర్క్ వ్యాప్తంగా ‘కవచ్ 4.0’-స్వదేశీయంగా రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపట్టబడ్డాయి.
దీనికి అనుగుణంగా, రైల్వే బోర్డు నిర్దేశించిన 402 రూట్ కి.మీ.ల లక్ష్యాన్ని అధిగమిస్తూ, ఈ జోన్ 487 రూట్ కి.మీ.ల మేర సంబంధించిన క్షేత్ర స్థాయి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. పకడ్బందీ ప్రణాళిక మరియు సమర్థవంతమైన అమలు ఫలితంగానే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 357 రూట్ కి.మీ.ల మేర లక్ష్యానికి గాను, ఈ జోన్ 479 రూట్ కి.మీ.ల ‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థను కూడా ప్రారంభించింది. ఈ రక్షణ వ్యవస్థ రైల్వే సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
‘కవచ్ 4.0’ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన క్షేత్ర స్థాయి పరీక్షలు కాజీపేట – పెద్దంపేట (101 రూట్ కి.మీ.), మల్కాజిగిరి – కామారెడ్డి (106 రూట్ కి.మీ.), చర్లపల్లి – రఘునాథపల్లి (79 రూట్ కి.మీ.), గుంతకల్లు – రాయచూరు (120 రూట్ కి.మీ.), ముద్ఖేడ్ – పర్భణి (81 రూట్ కి.మీ.) మధ్య ఉన్న రైల్వే సెక్షన్లలో నిర్వహించబడ్డాయి. పైన పేర్కొన్న సెక్షన్లలో ‘లోకో కవచ్’ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేయబడ్డాయి.
దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో, కాజీపేట – బల్హర్షా, విజయవాడ – దువ్వాడ మరియు వాడి – రేణిగుంట మధ్య ఉన్న వివిధ సెక్షన్లలో, మొత్తం 479 రూట్ కి.మీ.ల మేర ‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థను పూర్తిచేసి ప్రారంభించింది. ‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ అనేది రైళ్ల రాకపోకలను ఆటోమేటిక్ స్టాప్ సిగ్నల్స్ ద్వారా నియంత్రించే ఒక రైల్వే నిర్వహణ విధానం. రైళ్లు ఆయా మార్గాల గుండా ప్రయాణించేటప్పుడు, ఈ సిగ్నల్స్ స్వయంచాలకంగా పనిచేస్తాయి.
ఒకే దిశలో ప్రయాణించే రైళ్లు, వెనుక నుండి ఢీకొనే ప్రమాదం లేకుండా, సురక్షితమైన రీతిలో ఒకదాని వెనుక ఒకటి ప్రయాణించేలా అనుమతించే విధంగా ఈ ‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థ రూపొందించబడింది. ఇది రైల్వే నిర్వహణ ఖర్చులను వ్యయాలను తగ్గిస్తుంది, రైల్వే సెక్షన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో కూడా తోడ్పడుతుంది.
దక్షిణ మధ్య రైల్వే ఈ వ్యవస్థను ప్రారంభంలో నెట్వర్క్లోని అధిక రద్దీ గల మరియు ప్రధాన రైలు మార్గాలలో అమలు చేస్తున్నది .
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ మరియు కవచ్ క్షేత్రస్థాయి ప్రయోగాలను రికార్డు స్థాయిలో ప్రారంభించడంలో జోన్కు సహాయపడిన జోనల్ మరియు డివిజనల్ స్థాయిలలోని సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ విభాగాల అధికారుల ఉత్తమ పనితీరును మరియు వారి కృషిని అభినందించారు. జనరల్ మేనేజర్ భద్రతను పటిష్టపరచడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా కవచ్ మరియు ఏ.బి.ఎస్ లను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టనున్నట్లు తెలిపారు.
