గంజాయి రౌడీలుగా పేరు పొందిన వైసీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన సీపీఎం నాయకుడు పెంచలయ్య కుటుంబానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలిచారు. పెంచలయ్య కుటుంబ పోషణకి సొంతంగా రూ. 10 లక్షలు అందించారు. పెంచలయ్య కుమారుల చదువుల బాధ్యతను తీసుకుని తన కుమార్తెలు కోటంరెడ్డి హైందవి, కోటంరెడ్డి వైష్ణవికి అప్పగించారు.
పెంచలయ్య సాగించిన గంజాయివ్యతిరేక పోరాటానికి కలిసొచ్చే అన్నిపార్టీలతో కలసి మరింత ఉదృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. పెంచలయ్య విగ్రహాన్ని ఆర్.డి.టి. కాలనీలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పెంచలయ్య కుమారులు తాము ఐ.ఏ.యస్., ఐ.పి.యస్. కావాలని తమ నాన్న కోరిక అని, మాకు మీరు అండగా నిలిస్తే కష్టించి చదివి మా నాన్న కోరికను తీర్చి, సమాజానికి ఉపయోగపడతామని చెప్పారు.
దీనితో తీవ్రంగా చలించిన రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుమార్తెలు హైందవి, వైష్ణవికి ఫోన్ చేసి ఆ బాధ్యత అప్పగించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటలకు స్పందించిన కుమార్తెలు హైందవి, వైష్ణవి ఫోన్లో మాట్లాడుతూ, ఇప్పటికే తాము కొంత మందిని చదివిస్తున్నామని, ఈ ఇద్దరి బిడ్డల ఉన్నత చదువుల బాధ్యతను తాము తీసుకుంటామని మాట ఇచ్చారు.
పెంచలయ్య కుమారులు ఒకరు 9వ తరగతి, మరొకరు 5వ తరగతి చదువుతున్నారు. 10వ తరగతి వరకు వీరిద్దరికి ఉచితంగా చదువులు అందిస్తామని మాట ఇచ్చిన మైథిలి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్.డి.టి. కాలనీలో కొంత మేర కనీసవసతులు కల్పించామని, మరికొన్ని వసతుల కోసం వారం రోజుల్లో 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయిస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక ప్రజలకు మాట ఇచ్చారు.
పెంచలయ్య గంజాయికి వ్యతిరేక పోరాటం భావితరాలకు స్పూర్తిని ఇచ్చిందని, పెంచలయ్య విగ్రహాన్ని కాలనీలో ఏర్పాటు చేస్తామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. పెంచలయ్యను చంపిన హంతకులకు కఠినంగా శిక్షలు పడేవిధంగా తనవంతు ప్రయత్నం తాను చేస్తానని మాట ఇచ్చారు.
గంజాయి మూకలపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెంచలయ్య కుటుంబానికి అండగా నిలిచిన రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సి.పి.ఎమ్. నేత మరియు మాజీ డిప్యూటి మేయర్ మాదాల వెంకటేశ్వర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వారి బిడ్డల చదువులకు అండగా నిలచిన రూరల్ ఎమ్.ఎల్.ఏ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
