రాష్ట్ర అభివృద్ధికి అడగడుగునా అడ్డం పడుతున్న వైసీపీకి.. ఏపీ హైకోర్టు షాకిచ్చింది. గూగుల్ డేటా సెంటర్కి తక్కువ ధరకే భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. వైసీపీ ఎంపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రోత్సహకాలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని పిటిషనర్ను ప్రశ్నించారు. ఇతర దేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన పోటీ ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులు తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇవాళ్టి పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరలకే భూములు ఇస్తామని పంతానికి పోతే.. పరిశ్రమలు దండం పెట్టి.. వెళ్లిపోతాయని హైకోర్టు కామెంట్ చేసింది. ఐటీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేందుకు తక్కువ ధరకే భూములు ఇవ్వాలని ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. కార్య నిర్వాహక వ్యవస్థ విధుల్లో జోక్యం చేసుకోవడానికి కోర్టులు లేవని తేల్చి చెప్పారు. న్యాయపరమైన అంశాలేమీ లేకపోయినా.. ప్రచారం కోసమో.. రాజకీయ కారణాలతోనే పిల్స్ వేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో తెలుగు వారే ఎక్కువ శాతం ఉన్నారని హైకోర్టు పిటిషనర్కు గుర్తు చేసింది. ఏపీని ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు కలుగుతాయని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని తేల్చి చెప్పారు.
పిటిషనర్ వాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్పై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఐటీ అభివృద్ది కేంద్రాలపై పిటిషన్లు వేసిన వైసీపీ మీద మండిపడ్డారు. జగన్కు ఏపీ యువత, రాష్ట్ర అభివృద్ధిపై ఇంత విద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
