తాను ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకుడిని కానని ప్రజల సమస్యలు వినడానికి, వారి కష్టాల్లో తోడుండేందుకు నిరంతరం అందుబాటులో ఉండే సేవకుడినని పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
శనివారం నరసరావుపేట షాదీఖానాలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక ఉచిత ఖత్నా మహోత్సవానికి పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు.
ముస్లిం సోదరులు కోరిన విధంగా సద్భావన భవనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. అలాగే ఆటోనగర్ అభివృద్ధి కోసం కేవలం షెడ్లకే పరిమితం కాకుండా, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో లేటెస్ట్ మెషినరీతో కూడిన ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’ ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం మెకానిక్ సోదరులు ముందుకు వస్తే పూర్తి బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
అత్యాధునిక పనిముట్లు అందుబాటులో ఉంటే శ్రమ తగ్గడమే కాక, ఆర్థికంగా మంచి లాభం చేకూరుతుందని వారికి తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నరసరావుపేటకు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకువచ్చామని ఈ ఏడాది నుండే అడ్మిషన్ల ప్రక్రియ మొదలవ్వబోతుందని అన్నారు.
తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో నిలిచిపోయిన ఐటిఐ కాలేజీ అభివృద్ధి పథంలో పెట్టి అవసరమైన సిబ్బంది నియామకానికి చొరవ చూపుతున్నామని, ఈ ఏడాది నుండి క్లాసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను కేవలం పదో తరగతితో ఆపేయకుండా ఉన్నత చదువులు చదివించాలని చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చే తల్లికి వందనం, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాలను ఉపయోగించుకుని వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అందుకు ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడిన తురకపాలెంను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ముస్లిం జనాభా అవసరాల దృష్ట్యా ఆరు నుంచి ఏడు కమ్యూనిటీ హాల్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని, ముస్లిం సోదరులు అందుకు కావలసిన స్థలం సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు షేక్. జానీ సైదా, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలాని, రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పలువులు కూటమి నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
100 మంది పిల్లలకు సామూహిక ఖత్నా
ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్, ఆజాద్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో 100 మంది పేద ముస్లిం మైనార్టీ పిల్లలకు సామూహిక ఖత్నా నిర్వహించారు.
