ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురు రౌడీషీటర్లను పల్నాడు జిల్లా నుంచి 6 నెలల పాటు బహిష్కరిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. బహిష్కరణకు గురైన పంగా ఇద్దయ్య, (28), పంగా అంజయ్య (54), గన్నెబోయిన లక్ష్మయ్య, (51) వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా బహిష్కరణ విధించడం ఇది తొలిసారి.
పోలీసుల కథనం ప్రకారం, పంగా ఇద్దయ్యపై మాచర్ల పోలీస్ స్టేషన్, పంగా అంజయ్య, గన్నెబోయిన లక్ష్మయ్యలపై వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు ఉన్నాయి. పలు నేరాల్లో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురూ ఇటీవల అక్రమ మారణాయుధాలు కలిగి ఉండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేరచరిత్ర కలిగి అలవాటుపడిన నేరస్తులుగా కొనసాగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ చర్యలు తీసుకుంది.
బహిష్కరణ కాలంలో వీరు పల్నాడు జిల్లా పరిధిలోకి ప్రవేశించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రౌడీషీట్లు కలిగిన వారు గానీ, అలవాటుపడిన నేరస్తులు గానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని హెచ్చరించారు.
