నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. గతేడాది జరిగిన ‘జెన్ జీ’ (Gen Z) నిరసనల అణచివేత, ఆ సమయంలో జరిగిన హింసకు సంబంధించి నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిరసనల్లో సుమారు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. కొత్త ప్రధానమంత్రిగా బాలేంద్ర షా (బాలెన్) ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
గతేడాది అవినీతికి వ్యతిరేకంగా, సోషల్ మీడియాపై నిషేధానికి నిరసనగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలను అణచివేసే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిషన్, అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ప్రాణనష్టానికి కారణమని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా కేపీ శర్మ ఓలీతో పాటు అప్పటి హోంమంత్రి రమేష్ లేఖక్ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
భక్తపూర్లోని తన నివాసంలో ఉన్న ఓలీని భారీ భద్రత నడుమ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత హోంమంత్రి సుదన్ గురుంగ్ స్పందిస్తూ, చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఇది ఎవరి మీద పగతో చేస్తున్న చర్య కాదని, బాధితులకు న్యాయం చేసే ప్రక్రియలో ఇదొక భాగమని పేర్కొన్నారు. కాగా, తన అరెస్టును ఓలీ రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
