ప్రభుత్వ శాఖల మధ్య పూర్తిస్థాయిలో సమన్వయం ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఏపీరాష్ట్ర హోం మంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత సోమవారం అన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవిధంగా పరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
అన్నిశాఖలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని ఆమె ఆదేశించారు. మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వేసవి కాలాన్ని దృష్టిలోపెట్టుకొని త్రాగునీరు, పారిశుధ్యం, అగ్నిప్రమాదాల నివారణ, ఉద్యాన సాగు, గ్యాస్ సరఫరా, సాగునీరు తదితర కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంపద సృష్టి కూడా ముఖ్యమని పేర్కొన్నారు. వేసవిలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, నీరు కలుషితం కాకుండా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, దానిని దృష్టిలో పెట్టుకొని వడదెబ్బకు గురికాకుండా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.
అలాగే అగ్నిప్రమాదాలు సంభవించకుండా అగ్నిమాపకశాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. బాణాసంచా తయారీ కేంద్రాలు, స్క్రాప్ నిల్వ ఉంచే కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. బస్సు ప్రమాదాల నివారణపైనా దృష్టిపెట్టాలన్నారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. గృహవసర సిలండర్లు సరఫరాలో ఎటువంటి సమస్యా లేదని, ఎప్పటిలాగే సరఫరా జరుగుతుందని చెప్పారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా ఎక్కువమంది ఒకేసారి బుకింగ్ చేపడుతున్నారని అన్నారు.
గ్యాస్ సరఫరాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పర్యవేక్షణకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే సెల్ నెం.8074400947 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటయ్యిందని తెలిపారు. జిల్లా జైలు నిర్మాణానికి సారిక వద్ద పదెకరాల వరకు స్థలాన్ని గుర్తించడం జరిగిందని, దీని ఇప్పటికే సుమారు రూ.14కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
పూసపాటిరేగ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో ని మహిళల్లో ఎక్కువగా అల్సర్లు రావడంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. రహదారుల నిర్మాణానికి అటవీశాఖ నుంచి వీలైనంత వేగంగా అనుమతులు వచ్చేవిధంగా, అటవీ, పంచాయితీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో మామిడిపూత ఎక్కువగా రాలిపోవడంపై, శాస్త్రవేత్తల బృందంతో అధ్యయనం చేయించాలని చెప్పారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డిఆర్సి వివరాలను మంత్రి తెలియజేశారు.జిల్లాకు వివిధ శాఖల ద్వారా సుమారు రూ.3000 కోట్లు నిధులు మంజూరయ్యాయని, వాటిని సద్వినియోగం చేసుకొనేందుకు బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
త్వరలో నెల్లిమర్ల పిహెచ్సిని ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసేందుకు సుమారు రూ.118 కోట్లతో భూసేకరణకు ప్రతిపాదించామన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్ పరిహారాన్ని ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ చేపట్టేది లేదని స్పష్టం చేశారు.
రెండున్నర నెలల్లో టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని, ఈ లోగా పూర్తిస్థాయిలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని మంత్రి అనిత తెలిపారు.రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశంలో మాట్లాడుతూ, అర్హత ఉన్నవారందరికీ ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.
దీనికోసం లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ఎంతమందికి లేఅవుట్లలో ఉన్న మౌలిక సదుపాయాలు, సమస్యలు, ఎంతమందికి ఇళ్లు ఇచ్చారు, స్థలాలు లేకుండా పట్టాలు మాత్రమే కలిగినవారు ఎంతమందీ తదితర సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి సుమారు 50 ఎకరాల భూమిని గుర్తించాలని అధికారులకు సూచించారు.
దీనికోసం నిధులు కూడా మంజూరై సిద్దంగా ఉన్నాయని మంత్రి వెళ్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పరిహారం చెల్లింపు సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ శాఖాపరమైన అంశాలను మంత్రులకు వివరించారు. జిల్లాలో ఉపాధిహామీ పథకంలో సగటు వేతనం ఇటీవల కాలంలో పెరిగిందన్నారు.
ఎంఎల్సిలు గాదె శ్రీనివాసులనాయుడు, పెనుమత్స సురేష్, కావలి గ్రీష్మ, ఇందుకూరి రఘురాజు, ఎంఎల్ఏలు కిమిడి కళావెంకటరావు, కోళ్ల లలితకుమారి, బేబీనాయన, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మార్క్ఫెడ్ రాష్ట్ర ఛైర్మన్ కర్రోతు బంగారురాజు, తూర్పుకాపు ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, డిసిసిబి ఛైర్మన్ కిమిడి నాగార్జున, డిసిఎంఎస్ ఛైర్మన్ గొంపకృష్ణ తదితరులు మాట్లాడుతూ పలు సమస్యలను ప్రస్తావించారు. ఎస్పి ఏఆర్ దామోదర్, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, సిపిఓ పి.బాలాజీలు పాల్గొన్నారు.
