వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం సాగుతున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు ఆ పార్టీ సర్కిల్స్లో కొత్త చర్చకు దారి తీసింది. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి…కోటరీ రాజకీయాల కారణంగా జగన్కు, తర్వాత పార్టీకి దూరమయ్యారు.
అయితే, ఇప్పుడు సీన్ మారుతోంది. రాజ్యసభ సభ్యత్వానికి హఠాత్తుగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సాయిరెడ్డి, ఓ దశలో బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆయన మళ్లీ జగన్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నరని, గతంలో తనను సైడ్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతోంది.
విజయసాయిరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. గడ్డం పెంచి, సాదాసీదా రైతులా మారి పొలాల్లో ఎరువులు చల్లడం, పురుగు మందు పిచికారీ చేయడం వంటివి చూస్తుంటే ఆయన ఏదో పెద్ద వ్యూహంతోనే ఉన్నారనిపిస్తోంది.
తాను కూడా రైతునే అని చెప్పుకుంటూ అమరావతి రైతులపై సానుభూతి కురిపించడం వెనుక, పాత తప్పులను కప్పిపుచ్చుకుని తిరిగి ప్రజల్లోకి, ముఖ్యంగా జగన్ మనసులోకి వెళ్లాలనే ప్లాన్ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరించడం విజయసాయి పొలిటికల్ స్క్రిప్ట్లో భాగమేనని విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో పార్టీ ఘోర పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన తప్పుడు సలహాలే కారణమని జగన్ దగ్గరగా ఉన్న ఓ బలమైన వర్గం ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తోంది. సజ్జల వల్లనే కేడర్ దెబ్బతిందని, పార్టీ గ్రాఫ్ పడిపోయిందని భావిస్తున్న జగన్..ఇప్పుడు ఆయనను మెల్లగా దూరం పెడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఐతే ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. పార్టీని నడిపించడంలో సాయిరెడ్డికి ఉన్న నెట్వర్కింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్ మరెవరికీ లేవని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనే కరెక్ట్ అని జగన్ చెవిలో వేసే ఒక వర్గం యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ వాదనను గట్టిగా వినిపిస్తున్న సాయిరెడ్డి, అటు జగన్ను ప్రసన్నం చేసుకుంటూనే ఇటు సజ్జల ప్రభావాన్ని తగ్గించే పనిలో పడ్డారు. రాజ్యసభ రాజీనామా తర్వాత కొంతకాలం ఢిల్లీ స్థాయిలో బీజేపీతో టచ్లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చినా, ప్రస్తుతానికి వైసీపీ వైపే చూస్తున్నారని తెలుస్తోంది.
పార్టీ పునాదుల నుంచి ఉన్న నేతగా సాయిరెడ్డికి మళ్లీ పగ్గాలు అప్పగిస్తేనే పూర్వవైభవం వస్తుందని నమ్ముతున్న కేడర్, వచ్చే ఆరు నెలల కాలంలో ఆయన పార్టీలో కీ-రోల్ పోషించడం ఖాయమని భావిస్తోంది.
