సైనికపాటవాన్ని ప్రదర్శించిన గణతంత్ర దినోత్సవ పెరేడ్ తో బాటు ప్రధాని నరేంద్ర మోడీ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాగాతో ప్రధాని మోడీ అందరిని ఆకట్టుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక వస్త్రధారణతో, గాఢమైన మెరూన్ రంగు పాగాను ధరించి, అందులో బంగారు రంగు నెమలి ఈక ప్రత్యేక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకర్షించారు.
సున్నితమైన ఎంబ్రాయిడరీతో తయారైన ఈ పాగా వెనుక భాగంలో మెరూన్–పచ్చ రంగుల పొడవైన తోకతో మరింత శోభాయమానంగా కనిపించింది. పక్కవైపున బహురంగుల హ్యూస్తో గట్టిగా కట్టిన ఈ శిరోభూషణం వేడుకలకు ప్రత్యేక వైభవాన్ని చేకూర్చింది. ఈ పాగాను నేవీ బ్లూ–వైట్ కుర్తా–పైజామాతో పాటు లైట్ బ్లూ హాఫ్ జాకెట్తో మోడీ జోడించారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా రంగురంగుల, సంప్రదాయ పాగాలు ధరించడం ప్రధాని మోడీకి ప్రత్యేక గుర్తింపుగా మారింది.
గత ఏడాది 2024లో ఆయన గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలకు ప్రసిద్ధమైన బంధనీ (టై-డై) ముద్రణతో కూడిన బహురంగుల ‘సఫా’ను గణతంత్ర దినోత్సవానికి ఎంచుకున్నారు. 2023లో బహురంగుల రాజస్థానీ పాగాతో కనిపించిన మోడీ, అదే ఏడాది 77వ స్వాతంత్ర్య దినోత్సవానికి పొడవైన తోకతో కూడిన ప్రకాశవంతమైన రాజస్థానీ శైలి పాగాను ధరించారు. 2019లో రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అనంతరం, ఆరో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాలపై బహురంగుల పాగాతో మోడీ దర్శనమిచ్చారు.
2014లో తొలి స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రకాశవంతమైన ఎరుపు జోధ్పురీ ‘బంధేజ్’ పాగాను ధరించగా, 2015లో పసుపు రంగు పాగాను, 2016లో గులాబీ–పసుపు రంగుల టై-డై పాగాను ఎంచుకున్నారు. 2017లో ఎరుపు–పసుపు రంగుల మేళవింపుతో బంగారు గీతలున్న పాగా, 2018లో కాషాయం రంగు పాగా మోడీ వస్త్రధారణలో ప్రత్యేకంగా నిలిచాయి. కచ్ ప్రాంతానికి చెందిన ఎరుపు బంధనీ పాగా నుంచి రాజస్థానీ మస్టర్డ్ రంగు ‘సఫా’ వరకూ, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాగాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్కు చెందిన సంప్రదాయ టోపీని మోడీ ధరించారు. అందులో ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పమైన బ్రహ్మ కమలం ప్రేరణతో చేసిన బ్రోచ్ ప్రత్యేకతను చాటింది. 2021లో గుజరాత్ జామ్నగర్ రాజ కుటుంబం బహూకరించిన ఎరుపు ‘హలారి పగ్డీ’ను, పసుపు బొట్లు ఉన్న బంధేజ్ శిరోభూషణంగా మోడీ ధరించారు. ఈ విధంగా ప్రతి జాతీయ పండుగకు భిన్నమైన, ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించే పాగాలతో ప్రధాని మోడీ భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.
