కృష్ణా జలాలపై మరోసారి రాజకీయం ప్రారంభమైంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసుపై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న సమయంలో.. వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పోలిటిక్స్ చేస్తున్నారు. కల్తీ నెయ్యి కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ అంశాన్ని లేవనెత్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు వైసీపీ హయాంలో ప్లాన్ చేసినా.. మధ్యలోనే ఆగిపోయింది. కేసీఆర్ నాయకత్వంలోని అప్పటి తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లి.. స్టే తీసుకురావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. అనుమతి లేకుండా పనులు చేస్తే అధికారులను జైల్లో వేస్తామని ఎన్జీటీ హెచ్చరించడంతో 2022 తర్వాత అప్పటి జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత వైసీపీకి రాయలసీమ లిఫ్ట్ గుర్తుకొచ్చింది. జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం.. దీనికి ఎలాంటి అనుమతులు లేకపోవడమే. ట్రైబ్యునల్ నుంచి నీటి కేటాయింపులు కూడా లేవు.
మళ్లీ పనులు ప్రారంభించాలన్నా.. ఎన్జీటీ పర్మిషన్, కోర్టు అనుమతులు, నీటి కేటాయింపులు ఉండాలి. మరోవైపు కృష్ణా జలాలను మళ్లించే మరో ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. ఇక వర్షాలు తక్కువగా కురిసిన సంవత్సరాల్లో.. కృష్ణా నది మీద అన్ని ప్రాజెక్టులకు నీటి కొరత తప్పదు.
ఈ సమస్యలను గుర్తించిన కూటమి ప్రభుత్వం.. గోదావరి జలాలను తరలించడమే రాయలసీమ సాగునీటి సమస్యకు ఉత్తమ పరిష్కారం అని భావించింది. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ.. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు ఎక్కువ. గోదావరిలో అవసరానికి మించి నీళ్లు అందుబాటులో ఉన్నాయి.
పోలవరం నుంచి నల్లమలసాగర్ లింక్ పూర్తి చేస్తే ఏడాదికి 200 టీఎంసీల జలాలను రాయలసీమకు తరలించవచ్చు. కృష్ణా నది నుంచి ఇంత భారీ స్థాయిలో నీళ్లు తరలించడానికి తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్రలు ఒప్పుకోవు. కృష్ణాపై ఏ ప్రాజెక్టు ప్రారంభించినా.. న్యాయ వివాదాల్లో చిక్కుకొని ఆగిపోతుంది.
అందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రత్యక్ష ఉదాహరణ. జగన్ అధికారంలో ఉండగా అనుమతులు, కేటాయింపులు సాధించలేదు.. కనీసం ఎన్జీటీ స్టేని ఎత్తి వేయించలేకపోయారు. ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ పేరుతో చేస్తోంది పొలిటికల్ డ్రామానా.. ప్రజా పోరటామో ప్రజలే అర్ధం చేసుకోవాలి.
కానీ ఒక్కటి మాత్రం వాస్తవం.. పోలవరం నుంచి గోదావరి జలాలను తరలిస్తే.. ప్రస్తుతం కృష్ణా నది నుంచి రాయలసీమకు ఎన్ని నీళ్లు వస్తున్నాయో.. అన్ని నీళ్లు గోదావరి నుంచి కూడా వస్తాయి. నీటి కేటాయింపులు, అనుమతులు లేని ప్రాజెక్టు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూనే.. పోలవరం లింక్ పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేయడానికి.. కూటమి ప్రభుత్వం గోదావరి జలాలను మళ్లించాలని నిర్ణయించింది.
