విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. మృతురాలు ఏడు నెలల గర్భిణి కూడా కావడం ఈ ఘటనకు మరింత విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన అక్కయ్యపాలెం, ధాలి రాజు సూపర్ మార్కెట్ ఆపోజిట్ సంఘం ఆఫీస్ వద్ద చోటుచేసుకుంది.
ఆత్మహత్య చేసుకున్న దంపతులను పోలీసులు అనిత (25), వాసు (34)గా గుర్తించారు. భర్త వాసు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెంది ఉండగా, భార్య అనిత కింద పడి చనిపోయి ఉంది. అనిత ఏడు నెలల గర్భవతి అని పోలీసులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
