తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన దిశగా పోలీస్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో పట్టుబడిన సుమారు 4100 కిలోల గంజాయిని అధికారులు శుక్రవారం బహిరంగంగా దహనం చేశారు. రేణిగుంట మండలం ఎర్రం రెడ్డిపాలెం సమీపంలోని ఎలక్ట్రికల్ డంపింగ్ యార్డ్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్వయంగా పర్యవేక్షించి, ఈ గంజాయి నిల్వలను తగులబెట్టారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సమాజానికి చేటు చేసే మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తిరుపతిని తీర్చిదిద్దడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గత కొంతకాలంగా జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడిన ఈ గంజాయి విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా. మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని, నిరంతరం నిఘా కొనసాగుతుందని కలెక్టర్ మరియు ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
