రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించాలని పల్నాడు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రమైన అమరావతిలో బుధవారం పెదకూరపాడు నియోజకవర్గ స్థాయి సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ, పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజల సమస్యలు జాప్యం లేకుండా పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు.
భూముల రీ-సర్వేపై అవగాహన, శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను సమర్థంగా పరిష్కరించాలన్నారు.
సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. రీ-సర్వేను సాంకేతిక ప్రమాణాలతో ఎలా నిర్వహించాలి, అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పారదర్శకంగా అందజేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు.
భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియను యజ్ఞంలా పూర్తి చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ సూచించారు. భూముల సరిహద్దుల విషయంలో రైతుల మధ్య తలెత్తే అనుమానాలు, వివాదాలను క్షేత్ర స్థాయిలో సున్నితంగా, చట్టబద్ధంగా పరిష్కరించాలని సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ భాను కీర్తి వివరించారు. ఆయా సమావేశాలలో సర్వే విభాగం అదనపు డైరెక్టర్ భాను కీర్తి, సత్తెనపల్లి ఆర్డీఓ శ్రీరాములు, పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుజాత, 5 మండలాల రెవెన్యూ అధికారులు రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
ఒకే చోట తిష్టవేసిన అధికారులను మార్చాలి
ఈ కార్యక్రమానికి హాజరైన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని 100 గ్రామాల్లో 100 రోజుల పాటు పర్యటించి ప్రజలను స్వయంగా కలిశానని, ఆ సమయంలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలే తన దృష్టికి వచ్చాయన్నారు. ప్రజలు, రైతులు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చినప్పుడు కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది నుంచి సరైన స్పందన కరువైందన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎప్పుడూ ఒకే అధికారి ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, అందువల్ల ఒక మండలం నుండి మరొక మండలానికి అధికారులను తక్షణమే బదిలీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇంచార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
త్వరలో అమరావతి మండలంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా రెవెన్యూ యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలన్నారు. సిబ్బంది కొరత కారణంగా పనులు నిదానంగా సాగుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.
