శ్రీశైలం సహా రాష్ట్రంలోని వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ చేశారు.
అధికారులు, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను వివరంగా పరిశీలించి సూచనలు చేశారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి, ముందస్తుగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి సక్రమంగా లభించేలా కార్యచరణ అమలు చేయాలని ఆదేశించారు. దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులను ఎవరూ అవమానించేలా లేదా ఇబ్బంది పెట్టేలా వ్యవహరించకూడదని సీఎం స్పష్టం చేశారు. రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. శివరాత్రి వంటి మహాపర్వదినాల సందర్భంలో అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
