గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి విబి జిరామ్జి పథకం ఎంతగానో దోహదపడుతుందని ఏపీ రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవకా మిషన్ (గ్రామీణ్)) (విబి జిఆర్ఏఎంజి ) పథకాన్ని విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి శ్రీనివాస్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పథకంపై అవగాహన కల్గించేందుకు పంచాయితీరాజ్ శాఖ రూపొందించిన బుక్లెట్స్ను విడుదల చేశారు. అంతకుముందు తిరుపతిలో జరిగిన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ఇంతవరకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కీలకంగా నిలిచిందని అన్నారు. మన రాష్ట్రం ఈ పథకం వినియోగంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచిందని, అత్యధికంగా పని దినాలను కల్పించిన, బడ్జెట్ను వినియోగించిన ఘనత మన రాష్ట్రానిదని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో ఉపాధి కల్పనలో సాధించిన పురోగతిపై డ్వామా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రవేశపెట్టబడిన ఈ పథకం, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడిందని, గ్రామాల్లో ఆర్థిక ప్రగతికి సైతం దోహదపడిందని చెప్పారు.
దీని స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన విబి జిరామ్జి పథకాన్ని అత్యున్నతంగా మార్చారని, దీని వల్ల గ్రామాల్లో మరింత అభివృద్ది, ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని అన్నారు. గ్రామాలే దేశ ప్రగతికి దిక్సూచి అని, గ్రామీణ ప్రజలు ఆనందంగా ఉంటే, దేశం సంతోషంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ మాట్లాడుతూ, పథకంలో భాగంగా పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచడం జరిగిందని తెలిపారు. మరింత పారదర్శకతను పెంచేందుకు ఆన్లైన్ అటెండెన్స్ మరియు పని అప్రూవల్ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల వేతనాలు నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు.
ప్రధానంగా వాటర్ సెక్యూరిటీ, లైవ్లీహుడ్ అపర్చునిటీస్, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన మరియు వాతావరణ మార్పులను తట్టుకునే పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, దేశంలోనే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని ఆధునీకరిస్తూ, గతంలో మాదిరిగా కేవలం చెరువుల తవ్వకానికే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్, నీటి వనరుల సంరక్షణ మరియు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం విస్తరించిందని తెలిపారు.
దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, జెడ్పి సిఈఓ నాగలక్ష్మి, డ్వామా పిడి ఎస్.శారదాదేవి, బొబ్బిలి ఎంపీడీఓ రమ, వివిధ శాఖల అధికారులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, శ్రామికులు తదితరులు పాల్గొన్నారు.
