ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది! ఎక్కడో కాదు, సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డ, కోట లాంటి కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఒక అనూహ్యమైన ‘ప్లెబిసైట్’ (ప్రజాభిప్రాయ సేకరణ) జరిగిపోయింది. ఒక బహిరంగ సభ సాక్షిగా, వేలాది మంది జనం మధ్య జరిగిన ఈ ప్రజా తీర్పు చూసి రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
రాయలసీమ ఉక్కు పరిశ్రమ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మైక్ పట్టుకుని, జనాల మూడ్ కనిపెట్టడానికి ఒక ఆసక్తికరమైన ‘క్విజ్’ పెట్టారు. “మన అమరావతికి ఓటేస్తారా? ఆ మావిగన్ కు ఓటేస్తారా? అమరావతికా.. మావిగన్ కా?” అని ఆయన అడగడమే ఆలస్యం.. జనం నుంచి ఏకధాటిగా “అమరావతి.. అమరావతి..” అంటూ చేతులెత్తి నినాదాలు మిన్నంటాయి.
అయితే, ఆయనకు ఒక చిన్న అనుమానం వచ్చింది – “జనాలు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారేమో, కాస్త ట్విస్ట్ ఇచ్చి అడుగుదాం” అనుకున్నారేమో! వెంటనే ప్రశ్న స్టైల్ మార్చి, “మావిగన్ కా అమరావతికా?” అని తిప్పి అడిగారు. ఎంత తిప్పి అడిగినా, ఎన్నిసార్లు మార్చి అడిగినా.. జమ్మలమడుగు జనం మాత్రం ఏమాత్రం తడబడలేదు. నాయకుడు ప్రశ్నను ఎటు తిప్పినా, జనం మాత్రం తమ సమాధానాన్ని అస్సలు తిప్పలేదు. గొంతు మరింత పెంచి, మరింత గట్టిగా “అమరావతి!” అనే నినదించారు.
రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా జగన్ రెడ్డి సాగించిన మూడు ముక్కలాటలు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముచ్చట్లు.. వీటన్నింటికీ ఈ ఒక్క సభతో కడప జనం క్లారిటీ ఇచ్చేసినట్టు కనిపిస్తోంది. సొంత జిల్లాలోనే, అదీ రాయలసీమ నడిబొడ్డున ఉన్న జమ్మలమడుగు ప్రజలు ఈ స్థాయిలో అమరావతి వైపు మొగ్గు చూపడం అనేది వైకాపాకు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి.
ప్రశ్నను ఎలా ట్విస్ట్ చేసినా, ప్రజా తీర్పును ట్విస్ట్ చేయడం ఎవరి తరం కాదని జమ్మలమడుగు సభ నిరూపించింది. కడప కోటలోనే ఈ రేంజ్ లో అమరావతి నినాదం వినిపించిందంటే.. ఇక మిగిలిన ప్రాంతాల్లో జనం మూడ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నాయకులు ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా, ప్రశ్నలను ఎంత తిమ్మిని బమ్మిని చేస్తూ అడిగినా.. జనం మాత్రం తాము అనుకున్న దానికి ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. జమ్మలమడుగు వేదికగా జరిగిన ఈ ‘లైవ్ ప్లెబిసైట్’ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజధాని ఏదో తేల్చిచెప్పేసింది!
ఎన్నికల్లో వైకాపా మేనిఫెస్టోలో మావిగన్ పెడితే కడపలోని పులివెందులలో కూడా డిపాజిట్లు పోయేలా ఉంది.
