నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన మావోయిస్టు సాయుధ పోరాట ప్రస్థానం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ మరియు మల్లా రాజిరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వరుస ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లతో ఇప్పటికే బలహీనపడిన మావోయిస్టు ఉద్యమం, తాజా పరిణామాలతో తీవ్ర సంక్షోభంలో పడింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ద్వారా వందలాది మంది మావోయిస్టులు హతం కావడం, మార్చి 31 నాటికి ఈ ఆపరేషన్ను పూర్తి చేయాలని గడువు విధించడంతో సాయుధ పోరాటం క్రమంగా తెరమరుగవుతోంది.
ఇప్పటికే మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన హిడ్మా వంటి నేతలు ఎన్కౌంటర్లలో మరణించగా, మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆశన్న వంటి సీనియర్ నాయకులు ఇటీవలె పోలీసులకు లొంగిపోయారు.
పార్టీ మాజీ అగ్రనేత గణపతి అనారోగ్య కారణాలతో ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఈ భారీ పరిణామాలు నాలుగు దశాబ్దాల పాటు సాగిన సాయుధ విప్లవ పోరాటానికి ముగింపు పలకనున్నాయని రాజకీయ మరియు రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
