బిహార్లో పలు జిల్లాల్లో తల్లిపాలలో ప్రమాదకర స్థాయిలో యురేనియం (U-238) గుర్తించారు. తాజాగా వెలువడిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయింది. తల్లి పాల నుంచి సేకరించిన నమూనాల్లో యురేనియం కల్తీ ఉండటం శిశువుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
పలు సంస్థల పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ప్రకారం, తల్లిపాల ద్వారా శిశువులకు చేరుతున్న యురేనియం నాన్-కార్సినోజెనిక్ ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఏఐఐఎంఎస్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు.
40 మంది లాక్టేటింగ్ తల్లుల నుంచి సేకరించిన అన్ని నమూనాల్లో యురేనియం గుర్తించబడిందని, వీటిలో 70 శాతం శిశువులకు ఆరోగ్యపరమైన ప్రమాద సూచికలు (HQ>1) కనిపించాయని అన్నారు. అయితే, ఈ ధాతువు మొత్తం అనుమతించే పరిమితుల కంటే తక్కువగా ఉండటంతో, తల్లులకూ, శిశువులకూ వాస్తవ ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు.
ఖగారియా జిల్లాలో సగటు అత్యధిక స్థాయిలు, కతిహార్ జిల్లాలో అత్యధిక వ్యక్తిగత స్థాయిలు నమోదయ్యాయని తెలిపారు. దీర్ఘకాలిక యురేనియం ప్రభావం శిశువుల్లో నాడీ వ్యవస్థ అభివృద్ధిపై, మేధస్సుపై, IQ తగ్గుదలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. అయినప్పటికీ, తల్లిపాలను ఆపాల్సిన అవసరం లేదని, క్లినికల్ కారణాలు ఉన్నప్పుడే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
శిశువుల్లో యురేనియం విసర్జన సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వారు మరింత సున్నితమైన వర్గంగా పరిగణిస్తామని తెలిపారు. ఈ ప్రమాద అంచనాల్లో 70 శాతం శిశువులకు నాన్-కార్సినోజెనిక్ ప్రభావాలు కలిగే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంటుంది. యురేనియం సహజసిద్ధంగా గ్రానైట్ రాళ్లలో లభించేది. భూగర్భజలాల్లోకి గ్రహణం, బొగ్గు దహనం, గనుల తవ్వకాలు, న్యూక్లియర్ పరిశ్రమ వ్యర్థాలు, ఫాస్ఫేట్ ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల కలుషితం కావచ్చు.
తల్లిపాలలో భారీ లోహాలు, పురుగుమందులు, పర్యావరణ కాలుష్యకారకాల ఉనికిపై మరిన్ని అధ్యయనాలు అవసరమని డాక్టర్ అశోక్ తెలిపారు. ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో ఆర్సెనిక్, లీడ్, మెర్క్యురీ కూడా తల్లిపాలలో గుర్తించామని, భవిష్యత్తులో పురుగుమందులు సహా ఇతర కలుష్యాలపై బయోమానిటరింగ్ కొనసాగించడం అత్యవసరమని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాగునీటిలో యురేనియం పరిమితిని లీటరుకు 30 మైక్రోగ్రాములుగా నిర్ణయించింది. జర్మనీ వంటి కొన్ని దేశాలు దీన్ని మరింత కఠినంగా 10 మైక్రోగ్రాములుగా అమలు చేస్తున్నాయి. భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 151 జిల్లాల్లో యురేనియం కలుష్యత నమోదైందని, బిహార్లో 1.7 శాతం భూగర్భజల వనరులు ప్రభావితమయ్యాయని నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా కెనడా, అమెరికా, ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, యూకే, బంగ్లాదేశ్, చైనా, కొరియా, మంగోలియా, పాకిస్తాన్, మెకాంగ్ డెల్టా ప్రాంతాల్లో కూడా యురేనియం అధిక స్థాయిలు గుర్తించబడ్డాయి. అయితే, అధిక యురేనియం ఉన్నప్పటికీ, క్లినికల్ లక్షణాలు స్పష్టంగా బయటపడకపోవడం సర్వసాధారణమని పూర్వ అధ్యయనాలు సూచించాయి.
బిహార్లో U-238 స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, తల్లులు మరియు శిశువుల ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని అంచనా వేసి తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం అత్యవసరమని ఈ తాజా పరిశోధన పేర్కొంది.
