దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో ఇండియా లాంజ్ను ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘నేషన్ ఫస్ట్’ అనే స్పూర్తితో టీమ్ ఇండియాగా అందరం కలిసి పనిచేయాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ప్రస్తుతం భారత్ వేగంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని, ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానంగా భారత్ నిలుస్తోందని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నాయన్నారు. దేశానికి బలమైన నాయకత్వం ఉందని, భారత్ తన శక్తి సామర్థ్యాలను ఇప్పటికే ప్రపంచానికి చాటిచెప్పిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అదే సమయంలో పటిష్టమైన వ్యవస్థల నిర్మాణం కూడా జరుగుతోందని చెప్పారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా, అందరం భారత్కే ప్రాతినిధ్యం వహిస్తున్నామని, రాష్ట్రాలుగా పోటీపడుతున్నప్పటికీ దేశంగా ఒక్కటిగానే ముందుకు సాగుతూ పరస్పర సహకారం అందించుకుంటున్నామని వివరించారు. సంపద సృష్టితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళ్తోందో నేర్చుకునేందుకు మంచి అవకాశం కల్పిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలకు ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రాధాన్యత ఉందని సీఎం తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2047 నాటికి అగ్రస్థానానికి చేరుకునే దిశగా దేశం ముందుకెళ్తోందని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
