అనంతపురంహోమ్

సత్యసాయి లేకున్నా ఇంకా ఎనర్జీ ఇక్కడే ఉంది

#Puttaparthy

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి 1926 నవంబర్ 23న ఒక మహత్తర లక్ష్యంతో ఈ పుణ్యభూమిలో అవతరించారని పేర్కొన్నారు. సత్యసాయి 86 ఏళ్ల జీవన ప్రయాణంలో తన సిద్ధాంతాలు, జ్ఞానం, సన్మార్గాన్ని ప్రపంచానికి అందించారని, సమాజ సేవ, సమస్యలకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గం ద్వారా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేశారని తెలిపారు.

ఎనిమిదేళ్ల వయసు నుంచే భజనలు, ప్రార్థనలు చేస్తూ దైవ చింతనతో సాగిన సత్యసాయి, 1940 మే 23న 14 ఏళ్ల వయసులో సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వ నామాన్ని వదిలి సత్యసాయిగా సాక్షాత్కరించుకున్నారని సీఎం వివరించారు. దేవుళ్లు ఎక్కడో అవతరిస్తారని, అయితే సత్యసాయి ఈ పుణ్యభూమిని ఎంచుకుని, చిత్రావతి ఒడ్డున ఉన్న పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు నిలయంగా మార్చారని అన్నారు. మానవరూపంలో మనం చూసిన దైవమే సత్యసాయిబాబా అని ఆయన పేర్కొన్నారు.

శతజయంతి సందర్భంగా భగవాన్ సేవలను స్మరించుకోవడం అందరికీ అదృష్టమని, “లవ్ ఆల్, సర్వ్ ఆల్… హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్” అనే సత్యసాయి బోధనలు యుగాంతరాలు దాటి నిలిచే సిద్ధాంతాలని అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి విలువలతో బాబా నూతన అధ్యాయాన్ని ప్రారంభించారని చంద్రబాబు గుర్తుచేశారు. 1960లో స్థాపించిన సత్యసాయి సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలకు రూపం వచ్చిందని చెప్పారు.

దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు, సంపన్నులు బాబా మనోదర్శనానికి వచ్చి, ఆయన సేవా మార్గాన్ని అనుసరించారని సీఎం అన్నారు. ఎవరూ ఆహ్వానించకపోయినా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆయన సిద్ధాంతాన్ని పాటించారని, డబ్బు, పేరు, పదవి ఉన్నా లభించని ప్రశాంతతను పుట్టపర్తి ప్రసాదించిందని పేర్కొన్నారు. సత్యసాయి లేని తరువాత కూడా ఆయన నింపిన స్ఫూర్తి ప్రశాంతినిలయంలో ఎనర్జీగా నిలిచిందని అన్నారు.

శతజయంతితో పాటు ప్రశాంతినిలయం నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన ప్రత్యేకతను చంద్రబాబు ప్రస్తావించారు. భక్తుల బాధలకు పరిష్కారం చూపిన ఈ నిలయం ఆధ్యాత్మిక సంబరాలకు వేదికగా నిలిచిందని అన్నారు. “మానవ సేవే మాధవ సేవ” అని భావించిన బాబా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, తాగునీరు, మానసిక సంతృప్తి వంటి రంగాల్లో విశాలమైన సేవలు అందించారని తెలిపారు.

దేశ విదేశాల్లో ట్రస్ట్ సేవలు విస్తరించి ఉన్నాయని, 102 సత్యసాయి పాఠశాలలో 60 వేల మంది విద్యార్థులు ఉచిత విద్య పొందుతున్నారని చెప్పారు. ట్రస్ట్ ఆసుపత్రుల్లో రోజుకు 3 వేల మందికి వైద్యం అందుతోందని, ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1,600 గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా తాగునీరు అందించేందుకు రూ.550 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడరనైజేషన్‌కు రూ.250 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. సత్యసాయి సంస్థలు 140 దేశాల్లో 2 వేల కేంద్రాల్లో పనిచేస్తున్నాయని, 10 జోన్లుగా విస్తరించిన సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నదని చెప్పారు. సత్యసాయికి 7.50 లక్షల సేవా సభ్యులు ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు.

సత్యసాయి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విధంగా నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకు వెళ్తూ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వసుధైవ కుటుంబకంల భావన భారతీయుల మూలమైందని, సత్యసాయి బోధనలు ఆ విలువలను మరింత బలపరుస్తాయని అన్నారు.

Related posts

ఈనాడు రామారావు మాస్టారు ఇక లేరు

Satyam News

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

జగనన్న ఇళ్ల స్థలాల వెనుక వెయ్యి కోట్ల భూ దందా

Satyam News

ఏలూరులో హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

Satyam News

Leave a Comment