కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి చెప్పకుండా ల్యాబ్ రిపోర్టులను తారుమారు చేశారా.. అంటే.. ఈ విషయంలో అప్పట్లో టీటీడీ జనరల్ మేనేజర్గా పని చేసిన సుబ్రమణ్యం.. ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. డెయిరీ నిపుణుడు డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ ద్వారా ల్యాబ్ రిపోర్టులూ మార్చేశారట. శ్రీవెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీకి.. కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని 2022 ఆగస్టులోనే బయటపడింది. అప్పుడు జీఎంగా ఉన్న సుబ్రమణ్యం.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి.. ఈ విషయాన్ని అప్పుడే చెప్పారట. సిట్ విచారణలో ఈ సంగతులన్నీ వెల్లడించారు టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం.
కల్తీ వ్యవహారంలో ల్యాబ్ రిపోర్టును మార్చేశారు. డెయిరీ నిపుణుడు సురేంద్రనాథ్పై ఒత్తిడి తీసుకొచ్చి.. నెయ్యి కల్తీ జరిగిన విషయాన్ని రిపోర్టులో అస్సలు ప్రస్తావించ వద్దని చెప్పారట. కల్తీ విషయం బయటకు వస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే ఈ విషయం బయటకు పెట్టొద్దన్నారు. పై నుంచి వచ్చిన ఒత్తిడితో.. కల్తీ గురించి నేరుగా చెప్పకుండా.. నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిశాయని నివేదిక ఇచ్చారట. 2022 ఆగస్టులోనే నెయ్యి కల్తీ గురించి వైవీ సుబ్బారెడ్డికి తెలుసని.. సిట్ విచారణలో తేలింది. తెలిసీ మరో రెండేళ్ల పాటు.. వైసీసీ నియమించి టీటీడీ బోర్దు.. తిరుమలలో స్వామి ప్రసాదాలతో పాటు.. శ్రీవారి కైంకర్యాలకు.. కల్తీ నెయ్యినే వాడారు.
సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్.. నెయ్యి కల్తీ వ్యవహారాన్ని పక్కా ఆధారాలతో బయటపెట్టింది. ఇంత ఎవిడెన్స్ కళ్ల ముందు కనిపిస్తున్నా.. మాజీ సీఎం జగన్ మాత్రం.. అసలు కల్తీయే జరగలేదని అడ్డంగా వాదిస్తున్నారు. టీటీడీలో కల్తీ నెయ్యి వాడటం కంటే.. ఆ విషయాన్ని బయటపెట్టడమే పెద్ద తప్పు అని అడ్డగోలు లాజిక్కులతో వితండవాదం చేయడం వైసీపీ బ్యాచ్కే చెల్లింది. స్వామి వారి ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేయడం కంటే.. ఆ ఘోర అపచారాన్ని అందరికీ తెలియజేయడం మూలాన్నే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. వింత వింత వాదనలు చేస్తున్న జగన్ అండ్ కో.. జనం ముందు మరింత బద్నాం అవుతున్నారు.
