నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18, 2026న నిర్వహించిన జాతర సందర్భంగా గుట్టపై ఉన్న మల్లన్న స్వామి దర్శనానికి వచ్చిన దంపతులపై జరిగిన దాడి విషాదాంతమైంది.
ఈ ఘటనలో రెండు నెలల పసికందు మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. బాధితులు చిలుకేశ్వరం మౌనిక, గణేష్లు జాతర సందర్భంగా మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషిస్తూ వారిపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్కడితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడి, బాధితుల చేతిలో ఉన్న రెండు నెలల పసికందును కాలితో తన్నినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ శిశువును సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనను ఖండిస్తూ తెలంగాణ జన సమితి రాష్ట్ర బీసీ కన్వీనర్ జస్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎల్బీనగర్ ఇంచార్జ్ కేవీ రంగారెడ్డిలు మాట్లాడుతూ.. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని, నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి తగిన ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆలకుంట్ల వెంకటేష్, శంకర్, కల్వకుర్తి జేఏసి నాయకులు జంగయ్య పాల్గొన్నారు.
