భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యం గణనీయమైన వృద్ధి సాధించిందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజామైన్ నెతన్యాహూతో జరగనున్న తన చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి బుధవారం రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఇజ్రాయెల్కు బయలుదేరనున్నారు. పర్యటనకు ముందుగా విడుదల చేసిన ప్రకటనలో తన పర్యటన భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న “దీర్ఘకాల బంధాలను” మరింత బలపరచడమే కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుందని మోడీ తెలిపారు. సుస్థిరమైన, సృజనాత్మక, సమృద్ధి చెందిన భవిష్యత్తు కోసం రెండు దేశాల సంయుక్త దృష్టిని ముందుకు తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
“నా ప్రియ మిత్రుడు ప్రధానమంత్రి నెతన్యాహు ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది” అని మోడీ తెలిపారు. “విజ్ఞాన సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవసాయం, జల నిర్వహణ, రక్షణ మరియు భద్రత, వాణిజ్యం మరియు పెట్టుబడులు, అలాగే ప్రజల మధ్య సంబంధాలు వంటి విభిన్న రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నెతన్యాహుతో జరగనున్న చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను” అని ఆయన చెప్పారు.
ఇద్దరు నాయకులు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై పరస్పర ఆసక్తి గల విషయాలపై కూడా అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ పర్యటన సందర్భంగా మోడీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ను కూడా కలుసుకోనున్నారు. “ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన కెన్సాత్ ను ఉద్దేశించి ప్రసంగించే తొలి భారత ప్రధానమంత్రిగా నిలవడం నాకు గౌరవంగా భావిస్తున్నాను.
ఇది రెండు దేశాల మధ్య ఉన్న బలమైన పార్లమెంటరీ మరియు ప్రజాస్వామ్య బంధాలకు నివాళిగా నిలుస్తుంది” అని మోడీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో భారత్–ఇజ్రాయెల్ స్నేహాన్ని పదిలపరుస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
