ఆధ్యాత్మికంహోమ్

నేడు పవిత్ర భీష్మ ఏకాదశి

పౌరాణిక చరిత్రను పరిశీలించిన విజ్ఞులు, భీష్మాచార్యుడు మాఘశుక్ల సప్తమినుంచి ఏకాదశి నాటికి పంచప్రాణాలైన ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానములను వరుసగా యోగక్రియ ద్వారా త్యజించాడని వివరించారు.

ఈ అయిదు తిథుల పుణ్యకాలాన్నే భీష్మపంచకం అంటారు. ఈ అపూర్వకాలాన్ని సనాతన ధర్మపరులు పరమ పవిత్రంగా భావించి అవతార మూలమైన విష్ణుభగవానుని అర్చిస్తారు.అంపశయ్య మీదనుంచి భీష్మాచార్యుడు ధర్మరాజుకు కథలరూపంలో అనేక ధర్మబోధలు చేశాడు.

వాటిలో మహాతత్త్వదర్శి అయిన వామదేవుడు పవిత్ర చిత్తుడైన వసుమనుడనే రాజుకు చేసిన ఉపదేశగాథ ఒకటి. ఆ ఉపదేశగాథ సారాంశం ఇది. ధర్మాన్ని అనుసరించు. ధర్మానికి మించిన మరొకటి లేదు. ధర్మమునందు నిలకడ కలిగిన రాజు ఈ భూమినంతటినీ పాలించగలడు.

హితకరమైన సలహాలను పాటించేవాడు, ఈర్ష్యారహితుడు, జితేంద్రియుడు, బుద్ధిమంతుడు అయిన రాజు నదుల ప్రవాహంతో సముద్రం వృద్ధి చెందినట్లు ఖ్యాతి గడిస్తాడు. కృపణుడు, స్నేహశూన్యుడు, అనవసరంగా ప్రజాదండన చేసేవాడు, బుద్ధిహీనుడు, అపరాధులను గుర్తించలేనివాడు అనతికాలంలోనే అపకీర్తి పొంది పదవీచ్యుతి పొందుతాడు.

అసత్యం ఆడకూడదు. చెప్పకుండానే ప్రజలకు ప్రియమైన పనులు చేయాలి. కోరికతో గానీ, క్రోధంతోగానీ ద్వేషానికి లోనై గానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ధర్మహాని చేయకూడదు. ఎవరు ఏమి అడిగినా తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సంకోచం ఉండకూడదు. ఏ పనిలోనూ తొందరపాటు పనికిరాదు.

తనకు ప్రియం కలిగినప్పుడు పొంగిపోకూడదు. ముఖ్యమైన కార్యక్రమాలకు మిక్కిలి సమర్థులను, అనుకూలురను, జితేంద్రియులను, పవిత్రులను నియమించాలి. దుర్గ రక్షణ సాధనాలు, యుద్ధ సామగ్రి, న్యాయవ్యవస్థ, ఉన్నతమైన మంత్రాంగము, సమయానికి ప్రజలకు సౌకర్యాలను సమకూర్చడం అనే అయిదు విషయాల్లో రాజు సదా జాగరూకుడై ఉంటే ఆ రాజ్యం ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది.

దేశప్రజలు దయ కలిగినవారైతే ఆ రాజ్యపు మూలాలు బలమైనవని చెప్పవచ్చు. కష్ట సమయాల్లో ప్రజలను వెన్నంటి ఉన్న రాజునే ఎల్లప్పుడూ ప్రజలు ఎంచుకుంటారు. గుణవంతులైన తన బంధువులను గౌరవించని వాడు, మిక్కిలి క్రోధం గలవాడు, ద్వేషంతో రగిలిపోయేవాడు. రాజ్యపాలకునిగా అనర్హుడు. బలహీనుడైన శత్రువును తక్కువగా అంచనా వేయకూడదు.

Related posts

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

Satyam News

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు?

Satyam News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ ప్రారంభించిన సీఎం

Satyam News

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

నాయుడుపేటలో ఎన్‌.టి‌.ఆర్‌ విగ్రహ భూమి పూజ

Satyam News

Leave a Comment