మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో విమానాశ్రయానికి సమీపంలోని ఒక ఇంధన ట్యాంక్ లక్ష్యంగా డ్రోన్ దూసుకురావడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వెంటనే అప్రమత్తమైన దుబాయ్ సివిల్ డిఫెన్స్ బలగాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని దుబాయ్ మీడియా ఆఫీస్ ధృవీకరించింది.
ముందుజాగ్రత్త చర్యగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని విమానాలను అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారులు, టన్నెల్ను కూడా భద్రతా దళాలు కొద్దిసేపు మూసివేసి ట్రాఫిక్ను మళ్లించాయి.
అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు, ఇరాన్కు మధ్య గత రెండు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే ఇరాన్ వరుసగా గల్ఫ్ దేశాలలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ప్రస్తుతం విమానాశ్రయం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ప్రయాణికులు తమ విమానాల స్థితిగతులపై సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
