సీఎం చంద్రబాబు ఓవైపు అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో కియా సహా అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకువస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపుతున్నారు. కరువు పీడిత ప్రాంతంగా, ఒకప్పుడు ఫ్యాక్షన్ ముద్ర పడిన అనంతను పారిశ్రామిక హబ్గా మార్చి, వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు వ్యూహం.
బాబు తెచ్చిన కియా పుణ్యమా అని అనంతపురం ఇవాళ ప్రపంచ పటంలో నిలిచింది. కరువు నేలపై కార్ల తయారీ పరిశ్రమ వచ్చి, అభివృద్ధి పరుగులు పెడుతుందనుకుంటున్న తరుణంలో..మళ్లీ పాత ఫ్యాక్షన్ రోజులను గుర్తుచేస్తూ వైసీపీ నేతలు రప్పారప్పా అంటూ హింసకు తెరలేపడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వైసీపీ నేత తోపుదుర్తి, మడకశిర ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం నడిచింది. తోపుదుర్తి చేసిన ఆరోపణలు సాయంత్రంలోగా నిరూపించాలని, లేదంటే ఇంటి ముట్టడి చేపడతామని ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచే ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు.
ఐతే ఇదే అదునుగా వైసీపీ నేత తోపుదుర్తి భారీ కుట్రకు ప్లాన్ చేశారు. హైటెన్షన్ నేపథ్యంలో తోపుదుర్తి నివాసంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ సవాళ్లను అడ్డుపెట్టుకుని, నగర నడిబొడ్డున రౌడీయిజం చేయడానికి మినీ యుద్ధానికి సరిపడా వేటకొడవళ్లు, కత్తులు, ఇనుప రాడ్లను సిద్ధం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యాలు చూస్తుంటే అనంతపురం జిల్లాను మళ్లీ పాత ఫ్యాక్షన్ గడ్డగా మార్చేందుకు కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
వైసీపీ కుట్రను పోలీసులు సకాలంలో భగ్నం చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఖాకీలు సకాలంలో స్పందించకపోయి ఉంటే, అనంతపురం వీధులు మళ్లీ రక్తసిక్తం అయ్యేవనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి బాటలో నడుస్తున్న అనంతను మళ్లీ వెనక్కి నెట్టి, భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. గొడవలు సృష్టించేందుకు వచ్చిన వైసీపీ రౌడీ మూకలను చెల్లాచెదురు చేసిన పోలీసులు, నగరంలో అదనపు బలగాలను మోహరించి శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
