బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన గత 7 సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం నిర్మించాలనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 10వ సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నవతరం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు ఎస్. కె కరీం, నవతరం పార్టీ చీరాల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దామర్ల ప్రకాష్ బాబు విచ్చేసి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్బంగా ప్రకాష్ బాబు మాట్లాడుతూ డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదని,ఆయన రాసిన భారత రాజ్యాంగం ద్వారా ఈ రోజు దేశంలో ఎన్నో లక్షల ఉద్యోగాలు పొంది ఐఎస్ఎస్, ఐపీఎస్, రెవిన్యూ, పోలీస్ వంటి ఉద్యోగాల్లో లక్షల మంది కొలువై ఉన్నారని అన్నారు. కర్లపాలెం మండల కేంద్రంలో నిర్మించతలపెట్టిన డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ భవనం నిర్మాణం పూర్తి చేయకుండా గత ఏడు ఏళ్లుగా శిధిలావస్థలో ఉంచడం అత్యంత బాధకరమని అన్నారు.
ప్రజలకు ఉపయోగపడే ఈ భవన్ ను బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేన్నేటి కృష్ణ ప్రసాద్ చిత్తశుద్ధితో నిర్మాణం పూర్తి చేసి డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ అభిమానుల కలలను సాకారం చేస్తారని భావిస్తున్నానని చెప్పారు. ఈ భవనం గురించి త్వరలో బాపట్ల శాసనసభ్యులు, ఎంపీలను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో దళిత నాయకులు బోరుగడ్డ జీవన్, మురళికృష్ణ పాల్గొన్నారు.
