కడపహోమ్

మహర్షి భగీరథ జయంతి సందర్బంగా ఘన నివాళి

#NachiketViswanathanIPS

ధృడ సంకల్పం, అచంచల భక్తి, నిస్వార్థ త్యాగం ఈ మూడు గుణాల సమ్మేళనం మహర్షి భగీరథ జీవితమని వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. మహర్షి భగీరథ జయంతి సందర్బంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల సందర్బంగా జిల్లా ఎస్.పీ ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ మహర్షి భగీరథుని జయంతి సందర్బంగా అయన మహనీయ జీవితాన్ని స్మరించుకోవడం ప్రతి భారతీయేయుడి ధర్మంగా భావించాలన్నారు. భగీరథుడు ఇక్ష్వాకుల వంశానికి చెందిన ప్రతిష్టాత్మకమైన రాజు అని, అయన పూర్వికులు ఒక శాపం వల్ల భస్మమైపోయారని పురాణాలు చెబుతాయని ఎస్.పీ వివరించారు.

వారి ఆత్మలకు శాంతి కలగాలంటే గంగా నది జలాలు వారి భస్మంపై ప్రవహించాలని, ఈ  లక్ష్యాన్ని సాధించేందుకు భగీరధుడు కఠోర తపస్సు ఆచరించి ముందుగా బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడన్నారు. బ్రహ్మ గంగను భూమికి పంపేందుకు అంగీకరించినప్పటికీ, గంగ ప్రవాహం భూమిని తట్టుకోలేనంత బలంగా ఉంటుందని హెచ్చరించాడు.

దీంతో భగీరథుడు మరింత తపస్సు చేసి పరమశివుడిని ప్రసన్నం చేసుకుని శివుడు గంగను తన జటాలలో ఆపి, ప్రవాహాన్ని నియంత్రించి భూమిపైకి విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా గంగ భూమిపై ప్రవహించడం ప్రారంభమైంది. భగీరథుని కృషి వల్ల గంగకు ‘భగీరథి’ అనే పేరు కూడా వచ్చిందని ఎస్.పీ వివరించారు.

గంగ భూమిపై ప్రవహిస్తూ భగీరథుడు చూపిన మార్గాన్ని అనుసరించి, చివరికి ఆయన పూర్వీకుల భస్మం ఉన్న ప్రదేశానికి చేరి వారికి మోక్షాన్ని ప్రసాదించింది. ఈ ఘనత భగీరథుని అపారమైన పట్టుదల, భక్తి, మరియు త్యాగానికి నిదర్శనమన్నారు. అందుకే ఏదైనా మహత్తరమైన కార్యాన్ని సాధించేందుకు చేసిన కఠోర ప్రయత్నాన్ని ఇప్పటికీ ‘భగీరథ ప్రయత్నం’ అని పిలుస్తారు.

భగీరథుని జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. ముఖ్యంగా లక్ష్యం సాధించాలంటే పట్టుదల, సహనం, కృషి అవసరమని ఇది స్పష్టంగా తెలియచేస్తుందన్నారు. భగీరథుని జయంతి సందర్బంగా మనం ఆయనను స్మరించుకోవడమే కాకుండా, ఆయన ఆలోచనలను, గుణాలను మన జీవితంలో ఆచరణలో పెట్టాలి.

సమాజానికి మేలు చేసే పనుల్లో పాల్గొనాలని సూచించారు. మన కర్తవ్యాలను నిబద్దతతో నిర్వహిస్తూ, భగీరథుడి వంటి సంకల్పబలం కలిగి ఉండాలి. మహర్షి భగీరథుడు ధైర్యం, భక్తి, సంకల్పానికి ప్రతీక. ఆయన జయంతి మనకు స్ఫూర్తి నిచ్చే సందర్భమని, మహనీయుడు చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని నిర్మించుకోవడం నిజమైన నివాళి అవుతుందని జిల్లా ఎస్.పీ పేర్కొన్నారు.

కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అడిషనల్ ఎస్.పి బి.రమణయ్య, ఏ.ఆర్ డి.ఎస్.పి పి.నాగేశ్వర రావు, ఆర్.ఐ లు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

Satyam News

నవంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు

Satyam News

ఏపీకి కేంద్ర కేబినెట్‌ మరో గుడ్‌ న్యూస్‌

Satyam News

ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

Satyam News

ఈ రోజు లోకేశ్ – రేపు చంద్రబాబు – ఢిల్లీకి!

Satyam News

రష్యాకు విమాన భాగాలు అమ్మిన వ్యక్తికి శిక్ష

Satyam News

Leave a Comment