చిలకలూరిపేట సమీపంలోని లింగంగుట్లలో నిర్వహించిన పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నేడు పాల్గొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3,125 కోట్ల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు.
కార్యక్రమం అనంతరం ప్రజావేదిక ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను సీఎం పరిశీలించారు. రైతులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్లు, వర్మీకంపోస్టు తయారీ కేంద్రాలు, వ్యవసాయ ఆధారిత ఉపాధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే జాతీయ నూనెగింజల మిషన్, ఆయిల్ పామ్ మిషన్, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు సంబంధించిన ప్రదర్శనలను పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడప, కర్నూలు జిల్లాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ఈ ప్లాంట్లు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అధికారులు సీఎంకు వివరించారు.
పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగాన్ని రైతులతో కలిసి ముఖ్యమంత్రి వీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి గొట్టిపాటి రవి కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
