మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకం జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. జులై ఒకటి నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీబీజీ రామ్జీ పథకం అమలవుతుందని పేర్కొంది.
ఉపాధిహామీ పథకం స్థానంలో కొత్త పథకం వచ్చినప్పటికీ కూలీలకు ఎలాంటి అంతరాయం లేకుండా పని దినాలు లభిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉపాధిహామీ కింద జారీచేసిన జాబ్ కార్డులు ఈ-కేవైసీ పూర్తయి ఉంటే కొత్త కార్డులు జారీచేసే వరకూ చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
ఒకవేళ ఈ-కేవైసీ పెండింగ్లో ఉన్నప్పటికీ కూలీలకు పని కల్పిస్తారని, జాబ్ కార్డులు లేని వారికి గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. వీబీజీ రామ్జీ పథకం విధివిధానాలు, వేతన చెల్లింపులు, సమస్యల పరిష్కార వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే జారీచేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదించాల్సి ఉందని పేర్కొంది.
‘గ్రామీణాభివృద్ధి నిర్మాణంలో చారిత్రాత్మక మార్పు’
వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా, భారత గ్రామీణాభివృద్ధి నిర్మాణంలో ఇది ఒక చారిత్రాత్మక మార్పు అని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఈ పథకం ద్వారా జీవనోపాధి భద్రత, గ్రామీణ ఆదాయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని బలోపేతం చేయడమే ఈ చట్టం లక్ష్యమని పేర్కొంది.
ఇక, వేతన చెల్లింపుల్లోనూ స్పష్టమైన చర్యలకు ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కార్మికుల బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలోనే వేతనాలు జమ చేస్తామని వెల్లడించింది. మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోగా లేదా వారానికోసారి వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆలస్యం అయితే కార్మికులకు పరిహారం చెల్లించే నిబంధనలు కూడా ఉంటాయని పేర్కొంది.
ఈ కొత్త చట్టంతో లాభాలు
వీబీజీ రామ్జీ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ కల్పించనున్నట్లు కేంద్రం ఇదివరకే పేర్కొంది. ప్రస్తుతం ఎంఎన్ఆర్ఈజీఏ కింద అమల్లో ఉన్న 100 రోజుల ఉపాధి హామీతో పోలిస్తే ఇది 25 రోజులు ఎక్కువ. గ్రామీణ జీవనోపాధి భద్రత, ఆదాయ వృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ చట్టం తోడ్పడుతుందని కేంద్రం చెబుతోంది.
