హోర్మోజ్ జల సంధి లో సరకు రవాణా ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నట్లు సమాచారం అందుతున్నది. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్రరూపం దాల్చినప్పటికీ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్ఎన్జీ) ట్యాంకర్ల రాకపోకలు క్రమంగా పునఃప్రారంభమవుతున్నాయి. నౌకల కదలికలను పర్యవేక్షించే క్లెప్లర్, ఎల్ఎస్ఈజీ సంస్థల గణాంకాల ప్రకారం గత కొద్ది రోజుల్లో కనీసం ఐదు ఖాళీ ఎల్ఎన్జీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించాయి.
ఈ నౌకల్లో గ్రీకు నౌకాయాన సంస్థ గ్యాస్లాగ్ నియంత్రణలో ఉన్న గ్యాస్లాగ్ షాంఘై తో పాటు ఖతార్ ఎనర్జీకి అనుబంధంగా ఉన్న అల్ సమ్రియా, అల్ దఫ్నా, అల్ గట్టారా, అల్ రయ్యాన్ ట్యాంకర్లు ఉన్నాయి. గతంలో భద్రతా ఆందోళనల కారణంగా అనేక నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగించేందుకు వెనుకంజ వేసినా, ప్రస్తుతం కొన్ని సంస్థలు మళ్లీ ప్రయాణాలు ప్రారంభించడం గమనార్హం.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో అత్యంత కీలక మార్గంగా గుర్తింపు పొందింది. అమెరికా ఇరాన్ ఘర్షణల కారణంగా ఇటీవల ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు, భద్రతా హెచ్చరికలు పెరగడంతో నౌకాయాన రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయినప్పటికీ తాజా కదలికలు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోలేదనే సంకేతాలను ఇస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో బీమా వ్యయాలు, భద్రతా ప్రమాదాలు కొనసాగుతున్నాయని, నౌకాయాన సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొంటున్నారు.
