పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోంథా’ తుపాను మరింత బలపడి తీవ్రమైన తుపానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర–ఉత్తర పశ్చిమ దిశగా కదిలి ఈ ఉదయం 5.30 గంటలకు తీవ్ర తుపానుగా మారిందని వివరించింది. తుపాను ఈ ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నం నుంచి దక్షిణ-దక్షిణ తూర్పున 190 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 270 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను ఉత్తర–ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ, మచిలీపట్నం మరియు కలింగపట్నం మధ్య కాకినాడ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సమయంలో గాలివేగం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు, తాత్కాలికంగా 110 కిలోమీటర్ల వరకు దూసుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. మోంథా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
