మహిళల హక్కులు, సమానత్వం, సాధికారతపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న మహిళా హక్కుల వారోత్సవాల సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు, జిల్లా డిఆర్డిఏ పిడి ఝాన్సీరాణి తదితరులు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మహిళా హక్కుల వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం పురస్కరించుకుని నరసరావుపేట దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా హక్కుల వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా మాట్లాడుతూ, మహిళలపై వివక్షను తొలగించి సమాన హక్కులు కల్పించడం సమాజ అభివృద్ధికి చాలా అవసరమని తెలిపారు.
మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాల సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, చర్చా వేదికలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోస్టర్ల ద్వారా మహిళల హక్కులు, చట్ట పరిరక్షణలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో నరసరావుపేట డి.ఆర్.బి.సి. ఏరియా కోఆర్డినేటర్ తోకల సాంబయ్య, రాజుపాలెం మండలం ఏరియా కోఆర్డినేటర్ జి. కోటి రత్నం పాల్గొన్నారు.
