ఎనర్జీ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో, దక్షిణాదిన ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. కేంద్ర విద్యుత్తు శాఖ శుక్రవారం విడుదల చేసిన రోడ్మ్యాప్ టు 100 గిగా వాట్స్..హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై 2035-36 నివేదిక వెల్లడించింది.
56,335 మెగావాట్ల సామర్థ్యంతో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేసులో ఉండగా..41,525 మెగావాట్ల సామర్థ్యంతో రెండో స్థానంలో ఒడిశా, 32,750 మెగావాట్ల సామర్థ్యంతో AP మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. దక్షిణాదిలో ఏపీ తొలి స్థానంలో ఉంది. ఏపీలో ఇప్పటికే 1,680 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. మరో 2,850 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో 12,050 మెగావాట్ల ప్రాజెక్టులు సర్వే, DPR దశలో ఉన్నాయి. 2034-35 నాటికి ఏపీలో విద్యుత్తు స్టోరేజీ సామర్థ్యం 6 వేల 570 మెగావాట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.
ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తర్ప్రదేశ్లలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం మంచి స్థలాలు ఉన్నాయని, ఇక్కడ అభివృద్ధి చేసే ప్రాజెక్టులతో గ్రిడ్ విశ్వసనీయత మెరుగుపడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అంచనా వేసింది. దీంతో గరిష్ఠ డిమాండ్ ఉన్న సమయంలోనూ నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయడానికి వీలవుతుందని తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,66,845 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని స్పష్టం చేసింది.
అద్భుతమైన భౌగోళిక పరిస్థితులు, కూటమి ప్రభుత్వ చొరవతో ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ హబ్గా మారుతోంది. ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అతిపెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. అంతర్జాతీయ వేదికలపై లోకేష్ చేసిన గ్రీన్ ఎనర్జీ బ్రాండింగ్ కారణంగా..అదానీ, గ్రీన్కో, ఆర్సెలర్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో ఈ ప్రాజెక్టుల కోసం వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాయి.ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం రావడమే కాకుండా, స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, భవిష్యత్తులో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ అవతరించబోతోంది.
