ఏపీలో వైసీపీ రాజకీయ ప్రయాణం మూడు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. గత ఎన్నికల్లో భారీ పరాజయం తర్వాత.. ఫ్యాన్ పార్టీ బాగా నీరసించిపోయింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఈ నేపథ్యంలో 2026లో ఏపీలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందని కొన్ని సంస్థలు సర్వేలు చేశాయి. వైసీపీ ఓటు బ్యాంకు పెరగడం కాదు కదా.. రోజు రోజుకీ తగ్గిపోతోందని ఈ సర్వేలు స్పష్టం చేశాయి.
ఈ మధ్య కాలం వరకు పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగానే వైసీపీకి ఇన్ని సమస్యలు వచ్చాయని ఆ పార్టీ నేతలు భావించే వారు. కానీ లేటెస్ట్ సర్వేలో.. ఫ్యాన్ పార్టీకి మెయిన్ విలన్.. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎక్కువ మంది భావిస్తున్నారట. ప్రజల నాడిని పట్టుకోవడంలో జగన్రెడ్డి ఘోరంగా విఫలం అవుతున్నారని.. కరుడుగట్టిన వైసీపీ వీరాభిమానుల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఏపీలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండేది. స్ట్రాంగ్ కేడర్కు తోడుగా వివిధ వర్గాల నుంచి కొంత మంది కొత్త ఓటర్లను ఆకట్టుకోగలిగితే.. వైసీపీకి తిరుగులేదని ఆ పార్టీ నేతలు భావించేవారు.
కానీ ఐదేళ్ల జగన్ పాలనలో.. వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుకి భారీ గండి పడింది. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గంలోనూ వైసీపీ పట్ల వ్యతిరేకత కనిపించింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూటమి స్వీప్ చేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జనసేన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గం వైసీపీకి టాటా చెప్పేసింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్కి ఎదురుగాలే వీస్తోంది.
అమరావతిపై ఇంకా కుట్రలు కొనసాగించడం, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను వ్యతిరేకించడం వంటి చర్యలు జగన్కి పూర్తిగా నెగెటివ్ అవుతున్నాయి. గంజాయి బ్యాచ్లు, రప్పా రప్పా రౌడీలను సమర్ధించడం, ఫోటోలకు రక్తాభిషేకాలు చేసిన వారికి సన్మానాలు చేసి కానుకలు ఇవ్వడం వంటి చర్యలు జగన్ గ్రాఫ్ను మరింత తగ్గించాయి. ఇన్నాళ్లు వైసీపీ కష్టాలకు సజ్జలే కారణమని సరిపెట్టుకున్న ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు అసలు సమస్య జగనే అని తేలడంతో.. ఏం చేయాలో అర్ధంకాక తలపట్టుకొనే పరిస్థితి వచ్చింది.
