వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిర్వహించిన ప్రెస్మీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యి పేరుతో ఒక చీజ్ ప్యాకెట్ను చూపించారని, ఇందాపూర్ అంశంపై తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రెస్మీట్లో బొత్స చూపించిన ప్యాకెట్పై “Manufactured by Indapur” అని ఉండటాన్ని ఆధారంగా తీసుకుని హెరిటేజ్ నెయ్యి అక్కడ తయారవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై Heritage Foods ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. హెరిటేజ్ వివరణ ప్రకారం, ఇందాపూర్ డైరీ నుంచి కేవలం చీజ్, UHT పాలు, SMP (స్కిమ్డ్ మిల్క్ పౌడర్), పనీర్ వంటి ఉత్పత్తులనే కొనుగోలు చేస్తోంది.
నెయ్యిని అక్కడి నుంచి కొనడం లేదని స్పష్టం చేసింది. అలాగే హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ యూనిట్కు ఎలాంటి ఉత్పత్తులను సరఫరా చేయదని తెలిపింది. చీజ్ వంటి ఉత్పత్తులపై “Manufactured by Indapur, Marketed by Heritage” అని ముద్రించడం సాధారణ ప్రక్రియేనని, అందువల్ల దాన్ని నెయ్యిగా చూపించడం తప్పుడు ప్రచారమని విమర్శకులు అంటున్నారు.
ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ మాత్రమే కాకుండా Amul, Mother Dairy, Britannia Industries, Dodla Dairy, Patanjali Ayurved, Tata Consumer Products వంటి ఇతర ప్రముఖ సంస్థలు కూడా ఉత్పత్తులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో “Manufactured by Indapur” అన్న లేబుల్ ఆధారంగా ఒక్క హెరిటేజ్పై ఆరోపణలు చేయడం సరైంది కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో ప్రజలను గందరగోళానికి గురిచేయాలనే ఉద్దేశంతో తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీజ్ ప్యాకెట్ను నెయ్యిగా చూపించడం ద్వారా ప్రజలను మభ్యపెట్టారని బొత్సపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశముంది.
