ఎన్నికల వ్యూహకర్తల పేరుతో రాజకీయ పార్టీల నుంచి సేకరించిన నిధులను హవాలా మార్గంలో తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినీష్ ఛందేల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. నేడు న్యూఢిల్లీ కోర్టు అతడిని 10 రోజుల పాటు ఈడీ కష్టడీలో ఉంచాలని ఆదేశించింది.
2015లో స్థాపించిన Indian PAC Consulting Pvt Ltd ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలకు రాజకీయ వ్యూహ సలహాలు అందిస్తోంది. గతంలో ఇదే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డికి రాజకీయ వ్యూహాలను అందించింది. ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న ఈ కీలక సమయంలో అరెస్ట్ జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం సాయంత్రం 7.45 గంటలకు విచారణ అనంతరం చందేల్ను అరెస్ట్ చేశారు. భోపాల్లోని National Law Institute University Bhopal నుంచి లా పట్టా పొందిన చందేల్ సంస్థలో కీలక నిర్ణయాధికారి కాగా, 33 శాతం వాటా కలిగి ఉన్నారు. అదనపు సెషన్స్ జడ్జి షెఫాలి బర్నాలా టాండన్ నివాసంలో అర్ధరాత్రి విచారణ అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు 10 రోజుల కస్టడీకి పంపించారు.
కోల్ కతా బొగ్గు కుంభకోణంతో లింకులు
ఈ కేసు మార్చి 28న Prevention of Money Laundering Act కింద నమోదు చేయబడింది. ఢిల్లీ పోలీస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఐప్యాక్ డైరెక్టర్లు చందేల్, ప్రతీక్ జైన్, రిషి రాజ్ సింగ్లపై అక్రమ లావాదేవీలు, అకౌంటింగ్ లోపాలు, గుర్తు తెలియని నిధుల వినియోగంపై కేసు నమోదైంది. ఈ కేసు పశ్చిమ బెంగాల్ కోల్ స్కామ్ దర్యాప్తుతో అనుసంధానమై ఉందని ఇడీ పేర్కొంది.
ఏప్రిల్ 2న చందేల్ ఢిల్లీలోని నివాసంతో పాటు బెంగళూరులో రిషి రాజ్ సింగ్, ముంబైలో మాజీ ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ విజయ్ నాయర్ నివాసాలపై సోదాలు నిర్వహించారు. సంస్థలో లావాదేవీలను బ్యాంకింగ్ (ఖాతా) మరియు నగదు (అకౌంట్లో లేని) విధానాలుగా విభజించి అసలు ఆర్థిక కార్యకలాపాలను దాచిపెట్టినట్లు ఇడీ ఆరోపించింది. అక్రమ నిధులను చట్టబద్ధంగా చూపించేందుకు ఈ పద్ధతిని ఉపయోగించినట్లు పేర్కొంది.
అదేవిధంగా రూ.3.5 కోట్ల “షామ్” నిధులను వడ్డీ లేని రుణాలుగా చూపిస్తూ సంస్థలోకి చందేల్ ప్రవేశపెట్టినట్లు ఇడీ పేర్కొంది. మొత్తం రూ.50 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగిందని కూడా సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. కీలక సాక్ష్యాలను తొలగించేందుకు ఉద్యోగుల ఈమెయిల్స్, డేటాను తొలగించమని చందేల్ ఆదేశించినట్లు కోర్టులో ఇడీ వెల్లడించింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరెస్టు తగునా?
అయితే చందేల్ తరఫున న్యాయవాది వికాస్ పహ్వా ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరణతో నడుస్తోందని వాదించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. మార్చి 28న నమోదు చేసిన కేసు గురించి తమ క్లయింట్కు సమాచారం లేకపోవడం వల్ల అతని హక్కులకు భంగం కలిగిందని తెలిపారు.
ఇక అభిషేక్ బెనర్జీ ఈ అరెస్ట్పై స్పందిస్తూ, బెంగాల్ ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందు ఈ చర్య తీసుకోవడం సమాన పోటీకి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై కూడా ఇడీ ఆరోపణలు చేసింది. జనవరిలో కోల్కతాలో జరిగిన సోదాల్లో కీలక పత్రాలు తీసుకెళ్లినట్లు ఇడీ ఆరోపించగా, టీఎంసీ దీనిని ఖండించింది. ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశమున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
