క్రీడల అభివృద్ధి కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో పాటు క్రీడా సంఘాలు వివిధ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమిష్టిగా కృషి చేసినప్పుడే సమగ్ర క్రీడాభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
ఈరోజు నుండి మూడు రోజులపాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీనగర్ లో జరుగుతున్న చింతన్ శిబిర్ 2026కు తెలంగాణ నుండి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి( క్రీడలు) జయేశ్ రంజన్, క్రీడా సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి చైర్మన్ శివసేనారెడ్డి ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్ గగన్ నారంగ్ తదితరులు హాజరయ్యారు.
శ్రీనగర్ లోని షేర్- ఏ -కాశ్మీరి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్(SKICC) ప్రాంగణంలో ఈ రోజు ఉదయం యోగాతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో ఖేలో ఇండియా మిషన్ -మెడల్ స్ట్రాటజీ, ఖేలోభారత్ నీతి- కేంద్ర రాష్ట్రాల సమన్వయం, స్వచ్ఛత మరియు సురక్ష క్రీడలు, ప్రతిభ గుర్తింపు మరియు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, దేశంలో మంచి, బలమైన క్రీడా వాతావరణం నిర్మాణం జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలని దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా ఒకవైపు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను రాష్ట్రంలో దిగ్విజయంగా అమలు చేస్తూనే, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే అనేక కార్యక్రమాలను రూపొందించి బ్రహ్మాండంగా నిర్వహిస్తుందని మంత్రి వివరించారు.
హైదరాబాద్ అంటేనే ఆటలకు మారుపేరుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు క్రీడా శాఖ అనేక వినూత్నకార్యక్రమాలు రూపొందించిందని , గ్రామీణ స్థాయి నుండి క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందుకు రెండు దఫాలుగా నిర్వహించిన సీఎం కప్ 2024& 20 25లు ఉదాహరణ అని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా కార్యక్రమాలను, జాతీయ క్రీడా దినోత్సవంను “సండే ఆన్ సైక్లింగ్” ఒలంపిక్స్ విజేతలను గుర్తించే కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తుందని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి డాక్టర్ సోని బాలాదేవి, క్రీడా ప్రముఖులు పుల్లెల గోపీచంద్ గగన్ నారాయణ స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవితేజ తదితరులు ఈ శిబిరంలో తెలంగాణ తరఫున పాల్గొంటున్నారు.
