గుంటూరుహోమ్

అంపశయ్యపై నుంచి అభివృద్ధి పథంలోకి…

#NaraLokesh

కూటమి ప్రభుత్వం రాక నిస్తేజంలో కూరుకుపోయిన నేతన్నకు భరోసానిచ్చింది. గత రెండేళ్ల కాలంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంపశయ్యపై ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధి పథంలోకి పయనించసాగింది. ఒకవైపు నూతన టెక్స్ టైల్స్ పాలసీ, మరోవైపు వ్యక్తిగత లబ్ధి పొందేలా పథకాల అమలు, ఇంకోవైపు చేనేత సహకార సంఘాల బలోపేతానికి చర్యలతో డీలా పడిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం జవసత్వాలు నింపింది.

నేను కూలీని కాదు కళాకారుడిని అని నేతన్నలు కాలెరగేసేలా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. చేనేత రంగాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం నేతన్నలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం దక్కింది.

చేనేతకు పథకాలతో చేయూత…

2024లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం చేనేతలకు అండగా నిలిచింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెన్షన్ పెంచారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచారు. ఈ పథకం కింద 2024-25లో రూ.5 కోట్లు, 2025-26లోనూ మరో రూ.5 కోట్లు కేటాయించారు.

త్రిఫ్ట్ పథకం ద్వారా 5,726 మందికి లబ్ధి కలిగింది. రెండేళ్లలో రూ.65.35 కోట్ల మేర ముద్ర రుణాలను 6,808 మందికి అందజేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి)పథకం ద్వారా చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10.44 కోట్లను వెచ్చించగా, 7,500 మంది చేనేతలకు లబ్ధి కలిగింది. రూ.175 కోట్లతో ముడి పదార్థాల సరఫరా పథకం ద్వారా నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేత ఉత్పత్తుల 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.10 వేలు విలువ చేసే నూలును అందజేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించారు. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీతో పాటు క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు.

నేతన్నల కుటుంబాల్లో ‘ఉచిత’ వెలుగులు

గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా నేతన్నల కష్టాలను తెలుసుకుని, ఉచిత విద్యుత్ అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం నేతన్నలకు 500 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి రూ.150 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం వెచ్చిస్తోంది.

సుమారు 1.04 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ది కలుగనుంది. పథకం ద్వారా ఏడాదికి మగ్గం నేతన్నలకు రూ.8,640లు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600లు ఆదా అవుతోంది.

ఇళ్ల ముంగిటకే చేనేత వస్త్రాలు

నేటితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలో 5 జిల్లాల్లో నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కలంకారి చీరలు, పెన్ కలంకారి చీరలు, దుపట్టాలు, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, క్రోచెట్ లేస్ చీరల తయారీలో శిక్షణ అందజేశారు. ఆప్కో షో రూముల్లో రెడీమేడ్ చేనేత వస్త్రాలను అమ్మకాలు ప్రారంభించారు. వెల్క్రో ధోవతులు, కాటన్ రెడీమేడ్ పెళ్లికూతురి ధోవతులు, మోడీ జాకెట్లు, సిల్క్ పెళ్లికూతురి సెట్లు, కొత్త డిజైన్లతో రెడీమేడ్ షర్టులు, లెనిన్ షర్టుల సహా వందకు పైగా డిజైన్లతో చేనేత రెడీమేడ్ వస్త్రాలను అమ్మకాలు చేస్తున్నారు.

మారిన అభిరుచుల నేపథ్యంలో యువత, మహిళలు చేనేత వస్త్రాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. ఆన్ లైన్ లోనూ చేనేత రెడీమేడ్ దుస్తులు,ఇతర వస్త్రాలను విక్రయిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షో రూమ్స్ ద్వారా 6,770 ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టారు. ఈ కామర్స్ అమ్మకాలతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే వస్త్రాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆప్కో పేరిట సొంత వెబ్ సైటును అందుబాటులోకి తీసుకొచ్చారు. చేనేత వస్త్రాల పై సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేస్తూ, నేటి తరానికి నేతన్నలను కూటమి ప్రభుత్వం మరింత దగ్గర చేస్తోంది.

మెగా క్టస్లర్లు, టైక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు

చేనేతలకు 365 రోజులూ పని కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూతన టెక్స్ టైల్స్ పాలసీని అమలు చేసి, ఈ పాలసీ ద్వారా చేనేత రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడుల సేకరించాలని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా జాతీయ హ్యాండ్‌లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 10 క్లస్టర్లు ఏర్పాటు చేసింది.

రాయదుర్గం, హిందూపురం, బ్రాండెక్స్ టెక్స్ టైల్స్ పార్కుల అభివృద్ధితో పాటు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ కూడా నిర్మించనుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను రూ.38.31 కోట్లతో ఏర్పాటు చేయనుంది. మంగళగిరిలో చేనేత పార్క్ ఏర్పాటు చేయనుంది. పిఠాపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు.

9,120 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా రూ.15.11 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. రూ.172 కోట్లతో విశాఖపట్నంలోని మధురవాడలో యూనిటీ మాల్ ను నిర్మిస్తున్నారు. అమరావతిలో శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.

 చేనేత వస్త్రాల విక్రయాలకు ఒప్పందాలు

చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూనే, మరింత మార్కెటింగ్ సౌకర్యాలు పెంచే ప్రణాళికల్లో భాగంగా పలు ఒప్పందాలు చేసుకుంది. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్. ఏపీ హస్తకళల కార్పొరేషన్ తోనూ ఆప్కో ఒప్పందం చేసుకుంది. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచడానికి ఈ ఒప్పందాలు ఎంతగానో ఉపకరించనున్నాయి.

చేనేతకు లోకేష్ దంపతుల ప్రమోషన్

ఏపీ చేనేతకు… ప్రత్యేకించి మంగళగిరి చేనేత వస్త్రాలకు మంత్రి నారా లోకేష్ దంపతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. లోకేష్, బ్రాహ్మాణిలు ఏ శుభకార్యానికి వెళ్లినా చేనేత వస్త్రాలనే బహుకరిస్తున్నారు. ఇక బ్రహ్మాణి వివిధ సందర్భాల్లో మంగళగిరి చేనేత వస్త్రాలు ధరిస్తూ ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు లోకేష్ తాను కలిసే ప్రతినిధులకు… తనను కలవడానికి వచ్చే వారికి చేనేత శాలువాతో సత్కరిస్తున్నారు.. చేనేత వస్త్రాలను బహుకరిస్తున్నారు. ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలోనూ లోకేష్ చేనేత వస్త్రాలతో ఆయన్ను సత్కరిస్తారు.

తాజాగా ప్రజా ప్రతినిధుల కుటుంబాలకు ఇచ్చిన ఆత్మీయ విందులోనూ మంగళగిరి చీరలను నారా లోకేష్ బహుకరించారు. ఇక మంగళగిరిలో నేతన్నల కోసం వీవర్ శాల ఏర్పాటు చేశారు. ఈ వీవర్ శాలలో చేనేత రంగానికి నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక టూల్స్ అందుబాటులోకి తెచ్చి… చేనేత రంగాన్ని ప్రొత్సహిస్తున్నారు.

ఆప్కోలో అమ్మకాలు పెరుగుదల

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆప్కో షో రూమ్ ల బలోపేతానికి చర్యలు తీసుకుంది. అమ్మకాలు పెంచేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందజేసింది. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ, డిజిటల్ అమ్మకాలు ప్రారంభించింది. చీరలు, దుప్పట్లు, తువ్వాళ్లతో పాటు చేనేత రెడీమేడ్ దుస్తులను అమ్మకానికి పెట్టారు. పుట్టపర్తి, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, టెక్కలి, అనకాపల్లిలో అయిదు కొత్త షోరూమ్‌లు ప్రారంభించింది.

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రెండేళ్లలో రూ.188.01 కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. చేనేత సహకార సంఘాలకు విడతల వారీగా ఆప్కో బకాయిలు చెల్లిస్తూ వస్తోంది.

చేనేత రంగానికి అవార్డుల వెల్లువ

రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు వస్తున్నాయి. వన్ డిస్ట్రిక్ – వన్ ప్రొడెక్ట్ కింద పలు చేనేత వస్త్రాల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2024 సంవత్సరానికి గాను పది ఓడీ-ఓపీ అవార్డులను ఏపీ సొంతం చేసుకుంది. వాటిలో ఏడు అవార్డులు చేనేత, జౌళి శాఖకు చెందినవే కావడం విశేషం. ఆప్కోలో చేపట్టిన డిజిటైలేజేషన్ కు గానూ స్కోచ్ అవార్డు సొంతమైంది.

నేతన్నలకు 365 రోజులూ ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

గడచిన రెండేళ్ల కాలంలో చేనేత రంగానికి ఊపిరి పోసేలా కూటమి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. చేనేత కార్మికులకు గౌరవ జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సగం ధరకే చీర, దోవతి నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ చేనేత రంగానికి ఊపిరిపోస్తే, నేడు సీఎం చంద్రబాబు నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేసేలా పథకాలు రూపొందిస్తున్నారని మంత్రి చెప్పారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించేలా కూటమి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని మంత్రి వివరించారు.

గత నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో నేతన్న కుటుంబాలకు మరింత లబ్ధి కలుగుతోందని చెప్పారు. చేనేతలకు 365 రోజుల పాటు పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి సవిత చెప్పారు.

Related posts

చింతమనేని కి భారీ ఊరట

Satyam News

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు

Satyam News

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

Satyam News

గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000

Satyam News

Leave a Comment