అమెరికాలోని బాల్టిమోర్లో నిర్వహించనున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు & ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్లో భాగంగా ఆగస్టు 1న మధ్యాహ్నం 3 గంటల నుంచి బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రవాస భారతీయులతో మమేకమై, వారితో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ గ్లోబల్ ఛైర్మన్ శామ్ పిట్రోడా, మంత్రి జూపల్లి కృష్ణారావు, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలను మంత్రి జూపల్లి వివరించనున్నారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి సౌందర్యం, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తీసుకురావడంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆయన కోరనున్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంతో పాటు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక రంగానికి అంతర్జాతీయంగా విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ వేదికను వినియోగించుకోనున్నారు.
