తెలుగు ప్రజలు అమెరికా గడ్డపై అద్భుత విజయాలు సాధించారని ప్రశంసలు కురిపించారు మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్. అమెరికాలో మొట్టమొదటి బ్లాక్ గవర్నర్ ఉన్న ఏకైక రాష్ట్రం , దేశంలోనే తెలుగు మూలాలు ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న ఏకైక రాష్ట్రం మేరీల్యాండ్ మాత్రమేనని ఆమె ఎంతో గర్వంగా ప్రకటించారు.
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు విచ్చేసిన వారందరినీ ఆప్యాయంగా “నమస్కారం” అంటూ ఆమె తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.
మేరీల్యాండ్ రాష్ట్రంలో ఆటా మహాసభలు జరగడం ఇదే తొలిసారి అని, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఈ 19వ ఆటా కన్వెన్షన్ విజయవంతం కావడానికి అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తున్న ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా , కన్వీనర్ శ్రీధర్ బానాల ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు సంఘాన్ని ఏకం చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. అలాగే ఈ వేడుకల నిర్వహణకు ఉదారంగా తోడ్పడుతున్న హై-లెవెల్ డోనర్స్, గ్రాండ్ స్పాన్సర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, భారత్ నుండి విచ్చేసిన ప్రముఖ అతిథులకు తన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల విజయాలపై…
ఈ సందర్భంగా తెలుగు జాతి అమెరికా గడ్డపై సాధించిన అద్భుత విజయాలను అరుణా మిల్లర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు ప్రజలు వ్యాపారవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రముఖ కళాకారులుగా ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా, సమాజానికి తిరిగి ఎంతో సేవ అందిస్తున్నారని తెలిపారు. మాతృ భూమిని మర్చిపోవద్దు.. అని ఆటా మహాసభల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు.
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను విస్తరింపజేయడంలో ఆటా ప్రధాన భూమిక పోషిస్తోందని ఆయన కొనియాడారు.
అమెరికాలో ఉన్నత స్థానాల్లో స్థిరపడినప్పటికీ, జన్మనిచ్చిన మాతృభూమి అయిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎప్పటికీ మర్చిపోకూడదని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రవాసులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాల్సిఉండి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారని, ఆయన తరఫున శాసనమండలి చైర్మన్గా తాను, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు హాజరయ్యామని తెలిపారు.ఎన్నారైల సేవలు మాతృభూమి అభివృద్ధికి కూడా ఎల్లవేళలా ఉపయోగపడాలని కోరారు.
మేరీల్యాండ్లోని బాల్టిమోర్లో అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సేవా కార్యక్రమాలు, నాయకత్వ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ప్రారంభమైన ఈ మహాసభలకు అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రముఖులు, సామాజిక నాయకులు, రాజకీయ ప్రతినిధులు, కళాకారులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
వేడుకలు జ్యోతి ప్రజ్వలనతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆటా నాయకులు మరియు విశిష్ట అతిథులు పాల్గొన్నారు. ఆటా కోర్ కమిటీ సభ్యులతోపాటు పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు. అరుణా మిల్లర్ (మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్), హనుమంత రెడ్డి (ఆటా ఫౌండింగ్ మెంబర్), జయంత్ చల్లా (ప్రెసిడెంట్), శ్రీధర్ బనాల( కాన్ఫరెన్స్ కన్వీనర్), అయోధ్య రామిరెడ్డి (ఎంపి), రామచంద్రరావు (తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు) తదితరులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, చీకటి నుండి వెలుగు వైపుకు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపుకు నడిపిస్తూ తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం, యువతలో సేవా భావాన్ని పెంపొందించడం, అమెరికాలో తెలుగువారి ప్రాధాన్యతను మరింత బలోపేతం చేయడం ఈ మహాసభల ప్రధాన లక్ష్యాలని జయంత్ చల్లా తన ప్రసంగంలో పేర్కొన్నారు. మొదటి రోజు సింగర్ సునీత ఆధ్వర్యంలో జరిగిన కల్చరల్ ప్రోగ్రాములు అందరినీ అలరించాయి.
