తిరుమలలో పట్టు శాలువాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అవకతవకలలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మార్కెట్లో రూ.350కే లభించే శాలువాలను టీటీడీకి రూ.1,350కు సరఫరా చేయడం పెద్ద కుంభకోణమని ఆయన ఆరోపించారు.
ఈ విషయంపై బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించాకే ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. టీటీడీ ప్రతి ఏడాదీ సుమారు రూ.20 కోట్ల విలువైన పట్టు శాలువాలను కొనుగోలు చేస్తోందని, అయితే 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.80 నుంచి 90 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చిందని నాయుడు వెల్లడించారు. ఏసీబీ విచారణ పూర్తయ్యి నివేదిక వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీ వ్యవస్థలో భారీ అవినీతి చోటుచేసుకుందని, కల్తీ నెయ్యి సరఫరా, నాసిరకం సామగ్రి కొనుగోళ్లు, పరకామణి చోరీ వంటి ఘటనలు అప్పటి బోర్డు పాలనలోనే జరిగాయన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్గా ఉన్న సమయంలో వారికి అనుకూలంగా టెండర్లు కేటాయించిన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయని బి.ఆర్. నాయుడు పేర్కొన్నారు.
