ఆంధ్రప్రదేశ్లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణాలకు అనుమతులు సాధించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారం పది రోజుల్లో కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకం 1.0 కింద గతంలో రాష్ట్రానికి దాదాపు 19 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 2024 కంటే ముందే మంజూరైనా ఇప్పటికీ ఇళ్లు కట్టనివి 3.71 లక్షలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఇవి కాకుండా మరో 4 లక్షల గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వైసీపీ హయాంలో నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను కేటాయించడంతో లక్షలాది మంది ఇళ్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపించలేదు.
పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే కొత్తవి కేటాయిస్తామని వైసీపీ హయాం నుంచే కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త ఇళ్ల మంజూరుకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. ఈ కారణంతోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2.0 కింద తొలి విడతలో రాష్ట్రానికి కేవలం 77 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. కానీ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 9 లక్షల మంది వరకు ఇళ్లు లేని పేదలు ఉన్నారు. వీరికి ఇళ్లు మంజూరు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రంతో నిరంతర సంప్రదింపుల ద్వారా కొత్తగా 4 లక్షల గృహాలు కేటాయించేలా ఒప్పించారు
కొత్తగా వచ్చే 4 లక్షలు.. ఇప్పటికే కేటాయించిన 77 వేల గృహాలను జిల్లాల వారీగా లబ్ది దారులకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటితో పాటు వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా వేసిన లౌఔట్లను నివాసయోగ్యంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికీ ఇళ్లు కట్టుకోని వారి వివరాలు సేకరించి.. గృహ నిర్మాణాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
