అనంతపురం జిల్లా కూడేరు మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై విశ్వేశ్వరరెడ్డి తీసుకెళ్లారు.
ఎండిపోతున్న బోర్లు, పండ్ల తోటలు, తాగునీటి ఇబ్బందులను కలెక్టర్ కి వివరించి, ముద్దలాపురం, కరుట్లపల్లి, ఇప్పేరు, అరవకూరు, సీర్పి చెరువులను హంద్రీ-నీవా నీటితో తక్షణమే నింపాలని కోరారు. రైతుల పంటలను, పండ్ల తోటలను కాపాడటంతో పాటు ప్రజలు, పశువుల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధి రమణ,జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
