ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్వహించిన “తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన” రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఆమె ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, ప్రాంతీయ వాదాన్ని వేర్పాటువాదంతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్య అని అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా సాగి ప్రత్యేక రాష్ట్ర సాధనకు దారితీసిందని, అలాంటి ఉద్యమాన్ని వేర్పాటువాదంతో పోల్చడం సరైనది కాదని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశ సమైక్యత, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించిన కవిత, ఆయనపై దేశద్రోహం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ప్రాంతీయ ఆకాంక్షలను, ప్రజాస్వామ్య ఉద్యమాలను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం అంగీకరించదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు, మహిళలు భాగస్వాములయ్యారని, ఆ పోరాట చరిత్రను కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు హాజరై తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
