ఆంధ్రప్రదేశ్లో మరో పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా.. నక్కపల్లి మండలం.. రాజయ్యపేట సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి కొత్తగా కంపెనీ ప్రారంభించింది. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఈ పోర్టుని ఏర్పాటు చేయనున్నారు.
ఇండియాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అర్సెలర్ మిట్టల్ సరైన స్థలం కోసం వెతుకుతూ.. ఒడిషాకు వెళ్లాలని మొదట్లో ఆలోచించింది. అయితే మంత్రి నారా లోకేశ్ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్తో స్వయంగా మాట్లాడి ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పించిన విషయం తెలిసిందే. సుమారు లక్షన్నర కోట్ల పెట్టుబడితో అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ.. అనకాపల్లి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్తో పాటు పోర్టును అభివృద్ధి చేస్తోంది.
మొదటి దశ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం 2 వేల 200 ఎకరాల భూమిని కేటాయించింది. భవిష్యత్తులో విస్తరణ కోసం మరో 3 వేల 300 ఎకరాలను కేటాయించాలని కంపెనీ కోరుతోంది. ఇక్కడ నిర్మించే స్టీల్ ప్లాంట్ నుంచి ఏడాదికి 24 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తారు. పోర్టు నిర్మాణం కోసం తీర ప్రాంతంలో 316 ఎకరాలను కేటాయించారు.
విజయవంతంగా ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్సు
ఇప్పటికే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇక్కడ స్టీల్ ప్లాంట్, పోర్టు నిర్మాణానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు కూడా వచ్చాయి. రాజయ్యపేటలో నిర్మించే పోర్టు కోసం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ దశల వారీగా 5 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది.
మొదటి దశలో ఏడాదికి 20 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన కార్గోని హ్యాండిల్ చేసే విధంగా పోర్టు నిర్మాణం చేపడతారు. రెండో దశ విస్తరణలో భాగంగా పోర్టు సరకు రవాణా సామర్ధ్యాన్ని సంవత్సరానికి 50 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థాయికి పెంచుతారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పోర్టుతో పాటు గంగవరం, కళింగపట్నం పోర్టులు ఆపరేషన్లో ఉన్నాయి.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త పోర్టు నిర్మాణంలో ఉండగా.. ఇప్పుడు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరో పోర్టు రాబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తికాగా.. సీ పోర్టులు కూడా అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారుతుంది.
